అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా నుంచి భారత దేశం చమురు కొనుగోలు చేయడం తమకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశం వాషింగ్టన్, న్యూఢిల్లీల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో అసంతృప్తికి కారణమవుతోందని రూబియో పేర్కొన్నారు. ఫాక్స్ రేడియోతో జరిపిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన అవసరాలు అత్యధికంగా ఉంటాయని, వాటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అవసరమైన చమురు, గ్యాస్, బొగ్గు వంటి వాటిని కొనుగోలు చేసే అధికారం ఆ దేశాలకు ఉందని రూబియో అంగీకరించారు. అయితే రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ.. రష్యా భారత్కు తక్కువ ధరకు చమురును విక్రయిస్తుందని, ఈ చౌక ధరల వల్ల భారతదేశం రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తోందని ఆయన వివరించారు.
ఈ కొనుగోళ్ల ద్వారా లభించే ఆదాయం రష్యాకు ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధానికి ఆర్థిక సహాయం చేస్తుందని మార్కో రూబియో ఆరోపించారు. రష్యాకు నిధులు సమకూరుస్తున్న ఈ చర్యే భారత్తో జరిగే చర్చల్లో అమెరికాకు ఒక చికాకుగా మారిందని ఆయన అన్నారు. దీనిపై చర్చించేందుకు అమెరికా వైపు నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. విదేశాంగ విధానంలోని అన్ని అంశాలపై 100 శాతం సమయాన్ని కేటాయించడం సాధ్యం కాదని వివరించారు.
అయితే ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ రాయబారి విక్రమ్ దొరైస్వామి గతంలో గట్టిగా స్పందించారు. బ్రిటన్ రేడియో స్టేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "మా ఆర్థిక వ్యవస్థను ఆపేయమంటారా?" అని పశ్చిమ దేశాలను ఘాటుగా ప్రశ్నించారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తాము డిస్కౌంట్లలో కొనుగోలు చేస్తే తప్పేంటని నిలదీశారు. భారత్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, ఇంధన భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఒక తటస్థ వైఖరిని అవలంబించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచిస్తూనే, తన జాతీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే అమెరికా వంటి దేశాలు తరచుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి అని చెబుతూనే, అమెరికా తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం టారిఫ్లు, పెనాల్టీలు వంటి హెచ్చరికలను కూడా జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa