ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి తీపికబురు వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి గుడివాడకు మధ్య 27 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రాబోతోంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ హైవే కోసం రిక్వెస్ట్ చేయగా.. ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద రూ.600 కోట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నుంచి గుడివాడ వెళ్లేవారికి ఈ హైవే చాలా కీలకం.. కేంద్రమంత్రి గడ్కరీకి ఓ నివేదికను అందజేసి.. ఈ హైవే ప్రాధన్యం గురించి వివరించారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. వెంటనే గడ్కరీ అంగీకారం తెలిపారు.
ఈ హైవేతో పాటుగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు నుంచి NH-65 నేషనల్ హైవే వరకు ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఎంపీ చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. రూ.350 కోట్లు మంజూరు చేయాలని కోరారు. నివేదికలు తెప్పించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రహదారిలో ఏడు అండర్పాస్లు, నాలుగు పైవంతెనలు ఉంటాయి. NH 65 జాతీయ రహదారి నుండి పోర్టుకు సరకు రవాణా చేయడానికి ఇది చాలా కీలకం అని చెబుతున్నారు. నేషనల్ హైవే 65 నుంచి సరకు రవాణా వాహనాలు పోర్టుకు తరలించడానికి, తిరిగి తీసుకెళ్లడానికి ఈ గ్రీన్ఫీల్డ్ రహదారే కీలకం అన్నారు ఎంపీ బాలశౌరి.
అలాగే గుడివాడ పరిధిలో రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి గడ్కరీని నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేశారు. గుడివాడలో NH 216హెచ్ విస్తరణకు రూ.18.50 కోట్లు, NH 165, NH 216హెచ్ అనుసంధానానికి రూ.28.53 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. మచిలీపట్నం, మంగినపూడి బీచ్ల మధ్య రహదారి విస్తరణకు కూడా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఎంపీ తెలిపారు.
గుడివాడ పట్టణ పరిధిలో 216హెచ్ జాతీయ రహదారిని విస్తరించాలని ప్రతిపాదించారు. దీని కోసం ఈ వార్షిక ప్రణాళికలో రూ.18.50 కోట్లు అంచనా వేశారు. ఈ నిధులను మంజూరు చేయాలని గడ్కరీని కోరారు. ఇటు మచిలీపట్నం, మంగినపూడి బీచ్ మధ్య 11.07 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ గడ్కరీ సానుకూలంగా స్పందించి, వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసినందుకు ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఏపీకి సంబంధించిన నేషనల్ హైవేలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.. త్వరలోనే నిధులపై క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa