ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూముల కేటాయింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ఐదు ఐటీ కంపెనీలు రానున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. తాజాగా మరో ఐదు ఐటీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ఐదు కంపెనీలు కూడా విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించగా.. తాజాగా వీటికి ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్స్ బోర్డు లో తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో ఈ ఐదు కంపెనీలు కలిపి రూ.19,223 కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా.. సుమారుగా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు అధికారులు చెప్తున్నారు.


సిఫీ ఇన్ఫినిటీ స్పేషెస్ లిమిటెడ్ అనే సంస్థ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.15,226 కోట్లతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో పరదేశీపాలెంలో సిఫీ సంస్థకు ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 25 ఎకరాలు కేటాయించారు. అలాగే మధురవాడ ఐటీ సెజ్‌లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలు కేటాయించారు. ఈ పెట్టుబడుల ద్వారా 600 మందికి ఉపాధి దక్కనుంది. ఇక సత్వ డెవలపర్స్ అనే సంస్థ విశాఖలో రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మధురవాడలో ఎకరా కోటిన్నర చొప్పున 30 ఎకరాలు కేటాయించారు. సత్వ పెట్టుబడులతో సుమారుగా 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


ఇక ఏఎన్ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వేయి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఐటీ సెజ్‌లో ఎకరా 99 పైసల చొప్పున 10.29 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ పెట్టుబడులతో పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.పేనమ్‌ పీపుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు మధురవాడలోని హిల్‌-2లో 45 సెంట్లు, రుషికొండ ఐటీ పార్క్‌లో 4 ఎకరాలు మొత్తంగా ఎకరా రూ.4.05 కోట్లతో 4.45 ఎకరాలు కేటాయించారు.


పేనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.207.5 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీనిద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్ల ధరతో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. బీవీఎం ఎనర్జీ సంస్థ రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa