ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కు తీర్చుకోవాలంటే తలపై కొబ్బరి కాయ కొట్టించుకోవాల్సిందే

national |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 05:24 PM

మన దేశంలో భక్తి, విశ్వాసం, సంప్రదాయాలు అనేవి అందరి జీవితాల్లో అంతర్భాగం అయ్యాయి. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు ఉన్నప్పటికీ.. దాదాపుగా అందరూ దేవుళ్లను కొలుస్తూనే ఉంటారు. తమదైన శైలిలో మొక్కులు చెల్లించుకుంటూ కోరికలు కోరుకుంటారు. అలాగే ఆయా గుడులకు వెళ్తూ దర్శనలు చేసుకుంటారు. అయితే చాలా చోట్ల సాధారణంగానే దర్శన భాగ్యం ఉండగా.. తమిళనాడులోని ఓ ఆలయంలోకి వెళ్లాలంటే మాత్రం చాలా సాహసమే చేయాలి. సాహసమా ఏంటి అనుకుంటున్నారా.. ఏమీ లేదండి ఓ కొబ్బరి కాయను నెత్తిమీద కొట్టించుకోవాలి. మాడు పగిలితేనే మాత దర్శనం దొరుకుతుంది. మరి ఆ ఆలయం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఉన్న మెట్టుమహదానపురం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మన్ దేవాలయం ఉంటుంది. అక్కడే ప్రస్తుతం పెరుక్కు ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో అక్కడికెళ్లే భక్తులు తమ తలలపై కొబ్బరి కాయలు కొట్టించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వినేందుకు చాలా వింతగా అనిపిస్తున్నప్పటికీ.. చాలా ఏళ్లుగా అక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆచారం వినడానికే కాదండోయ్.. చూడటానికి మరింత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆలయ పూజారులు.. ఒకరి తరువాత మరొకరి భక్తుల తలలపై కొబ్బరికాయలు కొడతారు. ఈ ప్రక్రియలో తలలకు గాయాలు కావడం సర్వసాధారణం.


భక్తులు దైవం పట్ల తమకున్న భక్తిని, నమ్మకాన్ని ప్రదర్శించడానికి ఈ ఆచారాన్ని పాటిస్తారు. కొబ్బరి కాయలు కొట్టిన తర్వాత రక్తం కారుతున్నా, విపరీతమైన నొప్పి తమను వేధిస్తున్నా వారు మాత్రం నవ్వుతూ.. అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే తలపై కొబ్బరి కాయలు కొట్టించుకోవడం సాహసమైనదే అయినప్పటికీ.. అనేక మంది భక్తులు.. గుంపులు గుంపులుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు.


ఈ వినూత్న ఆచారం వల్ల కొన్ని దురదృష్టకర సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. చాలా మంది భక్తులకు తీవ్రమైన గాయాలయ్యాయి. కొందరి తలల నుంచి రక్తం కారడం కూడా కనిపించింది. దీంతో ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. గాయాలకు పసుపు రాసి, నొప్పి తగ్గించేందుకు ప్రయత్నించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ సమీపంలోనే ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ వైద్య శిబిరంలో సుమారు 40 మందికి పైగా భక్తులకు చికిత్స అందించారు. వారిలో చాలామందికి తల గాయాలకు కుట్లు వేయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా ఆ తర్వాత కూడా మరెంతో మంది భక్తులు తమ తలలపై కొబ్బరి కాయలు కొట్టించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa