ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్, చైనా కిరాయి సైనికులతో రష్యా మాపై యుద్ధం చేస్తోంది.: జెలెన్‌స్కీ

international |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 07:54 PM

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం మరింత క్లిష్టంగా మారుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా రష్యాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రష్యా సైన్యంలో చైనా, పాకిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన కిరాయి సైనికులు పోరాడుతున్నారని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ వార్త అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఖార్కివ్ ప్రాంతంలో సరిహద్దు సైనికులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు జెలెన్‌స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు.


17వ సెపరేట్ మోటరైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ సైనికులను కలిసేందుకు వెళ్లిన జెలెన్‌స్కీ.. అక్కడ ఉన్నత స్థాయి సైనిక కమాండర్లతో చర్చలు జరిపారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితి, ఖార్కివ్ ప్రాంతంలోని వోవ్‌చాన్స్క్ పట్టణ రక్షణ వ్యూహాలు, డ్రోన్ల సరఫరా, నియామకాల గురించి కమాండర్లతో ఆయన చర్చించారు. ఈ సమావేశంలోనే కమాండర్లు ఆయనకు రష్యా తరపున విదేశీ కిరాయి సైనికులు పోరాడుతున్నారని తెలిపారు. ఇది ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. జెలెన్‌స్కీ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ.. రష్యా సైన్యం యుద్ధం కోసం ఇతర దేశాల నుంచి సైనికులను ఎలా తీసుకు వస్తుందో ప్రపంచానికి తెలియజేశారు.


ఈ పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీ సైనికుల ధైర్యసాహసాలను ప్రశంసించి.. వారికి దేశ అత్యున్నత పురస్కారాలను అందించారు. అంతేకాకుండా దేశం కోసం అంతగా సేవ చేస్తున్న సైనికులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు జెలెన్‌స్కీ చేసిన కామెంట్లపై పాకిస్థాన్ స్పందించింది. ఆయన చెప్పేవన్నీ తప్పేనని.. తమ దేశం నుంచి ఏ ఒక్క సైనికుడు కూడా రష్యా వెళ్లలేదని, ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా జెలెన్‌స్కీ ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని కూడా పేర్కొంది. ఆయన చెప్పేది నిజమే అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించాలని వివరించింది. కానీ ఇది అబద్ధం కాబట్టి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. అందుకే జెలెన్ స్కీ సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేయలేరని వ్యాఖ్యానించింది.


జెలెన్‌స్కీ ఈ తరఫు కామెంట్లు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఆయన చైనా పౌరులు మాస్కో తరఫున యుద్ధం పాల్గొంటున్నారని ఆరోపించారు. అయితే వీటిని బీజింగ్ అప్పుడే ఖండించింది. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతునిచ్చింది. అందులో భాగంగానే భారీ సంఖ్యలో సంప్రదాయ ఆయుధాలను, 10 నుంచి 12 వేల మంది సైనికులను పంపించదని అంతర్జాతీయ మీడియాలు వెల్లడించాయి.


ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇటీవలే ఇస్తాంబుల్‌లో రెండు దేశాల అధికారులు సమావేశమై.. 1,200 మంది ఖైదీలను మార్పిడి చేసుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది కొద్దిగా ఆశను రేకెత్తించే అంశం అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో హింస కొనసాగుతూనే ఉంది. జెలెన్‌స్కీ పర్యటన సమయంలోనే.. జపోరిజియా ప్రాంతంలోని స్టెప్నోహిర్క్స్ కమ్యూనిటీపై రష్యా చేసిన దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఇది యుద్ధం ఇంకా ఎంత భయంకరంగా ఉందో తెలియజేస్తోంది. ఈ పరిస్థితుల్లో జెలెన్‌స్కీ చేసిన ప్రకటన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా ప్రపంచానికి మరోసారి గుర్తు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa