ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా.. బీకేర్ పుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 07:44 PM

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6000, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రం వాటా రూ.14000 వేలు కలిపి ఏటా మూడు విడతల్లో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ తొలివిడత నిధులను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సుమారుగా 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో రూ.7000 చొప్పున జమ చేసింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులై ఉండి.. ఈ-కేవైసీ, ఎన్‌పీసీఐ లింకింగ్ కానీ రైతులకు మరో అవకాశం కల్పించింది. వెంటనే ఈ ప్రక్రియలను పూర్తి చేసుకుంటే వారి అకౌంట్లోకి కూడా డబ్బులు జమ అవుతాయి.


అయితే ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశమే కొంతమంది కేటుగాళ్లకు వరంగా మారింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతూ సైబర్ మోసాలకు తెరలేపారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్తూ.. రైతుల ఫోన్లకు ఏపీకే ఫైళ్లను పంపి.. వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్లోని నగదు మాయం చేస్తున్నారు.


అన్నదాత సుఖీభవ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ వాట్సాప్ ద్వారా తొలుత సందేశం పంపిస్తారు. ఆ మెసేజ్‌లో ఏపీకే ఫైళ్లను పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేసి వివరాలను నమోదు చేస్తే మీ అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడతాయని నమ్మిస్తున్నారు. ఇది కచ్చితంగా చేయాల్సిన పని అని.. లేకపోతే మీకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడవని భయపెడుతున్నారు. దీంతో రైతులు ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేయగానే.. అవి మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ అవుతున్నాయి. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే ఫోక్ హ్యాక్ అయ్యి.. సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో సెల్‌ఫోన్లలోని సమాచారం, పాస్‌వర్డులు వారికి తెలిసిపోయి బ్యాంక్ ఖాతాల్లోని నగదు కాజేస్తున్నారు.


ఈ నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా సందేహాలు, అనుమానాలు ఉంటే నేరుగా సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాలు, లేదా సదరు అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లన ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్‌ సెట్టింగ్‌లలో Install from Unknown Sources ఆప్షన్‌ డిజేబుల్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa