ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులోని గూడెం కొట్టాల వాసులకు ఇళ్లపట్టాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 07:55 PM

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో హామీని నిలబెట్టుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్.. తాను పర్యటించిన ప్రాంతాలలోని సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఆయా ప్రాంతాలవాసుల కష్టనష్టాలను తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ విధంగానే కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు అశోక్‌నగర్‌లోని గూడెం కొట్టాల వాసులకు నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు. అశోక్‌నగర్‌లోని పంప్ హౌస్ ప్రాంతంలో గూడెం కొట్టాల వాసులు సుమారుగా 40 ఏళ్ల నుంచి పూరిగుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ గత కొన్నేళ్లుగా వీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఈ క్రమంలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అప్పటి కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాల వాసులు నారా లోకేష్‌ను కలిశారు. తమకు శాశ్వత ఇళ్లపట్టాలు ఇప్పించాలని కోరారు. దీంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గూడెంకొట్టాల వాసుల సమస్యను పరిష్క,రిస్తామని నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన హామీ ప్రకారం తాజాగా 150 మంది గూడెం కొట్టాల వాసులకు శాశ్వత ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. 2025 జనవరిలో టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.30 ద్వారా ఎకరా స్థలాన్ని 150 మంది పేదలకు ఇళ్లపట్టాల కింద పంపిణీ చేశారు. మంత్రి టీజీ భరత్‌ చేతుల మీదుగా బుధవారం శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం.. ఇళ్లపట్టాలు పంపిణీ చేసినట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. జనవరిలో జారీ చేసిన జీవో 30 కింద తొలిసారిగా మంగళగిరిలో ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తే, రెండోసారి కర్నూలులో ఇచ్చామని గుర్తు చేశారు. ఇంత వేగంగా పని పూర్తి చేసినందుకు అధికారులను టీజీ భరత్.. అభినందించారు.


సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న మంత్రి టీజీ భరత్.. ఈ క్రమంలోనే ఏడాది ఆఖరు నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుతం గూడెం కొట్టాలలోని 150 మందికి రెవెన్యూ పట్టాలు అందించామని.. త్వరలోనే రిజిస్టర్ట్ పట్టాలు ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గూడెం కొట్టాల వాసులు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa