భారత రాజ్యాంగం ప్రసాదించిన 'ఒక వ్యక్తి, ఒక ఓటు' హక్కుపై దాడి చేస్తే, ఎన్నికల కమిషన్ (ఈసీ)పై తాము కూడా దాడి చేస్తామని, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో నిర్వహించిన నిరసన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇది కేవలం తన గొంతు కాదని, యావత్ హిందుస్థాన్ గొంతుక అని స్పష్టం చేశారు.ఎన్నికల మోసం ఫిర్యాదుపై తన నుంచి అఫిడవిట్ కోరారని, కానీ తాను ఇప్పటికే లోక్సభలో రాజ్యాంగంపై ప్రమాణం చేశానని రాహుల్ గుర్తుచేశారు. "రాజ్యాంగ మౌలిక సూత్రం 'ఒక వ్యక్తి, ఒక ఓటు'. ఈసీ అధికారులు దానిపైనే దాడి చేస్తున్నారు. అంటే మీరు పేదలపై దాడి చేస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసి సులభంగా తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటే. సమయం పట్టొచ్చు, కానీ మిమ్మల్ని ఒక్కొక్కరిగా పట్టుకుంటాం" అని రాహుల్ హెచ్చరించారు.బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని కేవలం ఒక్క మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్పై తాము దృష్టి సారించామని, అక్కడే బీజేపీ, ఈసీ కుమ్మక్కై మోసానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. "మహాదేవపురలో మొత్తం 6.5 లక్షల ఓటర్లు ఉంటే, అందులో 1.25 లక్షల ఓట్లను దొంగిలించారు. అంటే ప్రతి ఆరుగురిలో ఒక ఓటును తారుమారు చేశారు" అని ఆయన వివరించారు. సుమారు 12,000 మంది నకిలీ ఓటర్లు ఐదారు పోలింగ్ బూత్లలో ఓటు వేశారు.దాదాపు 40,000 ఓట్లను నకిలీ ఐడీలతో నమోదు చేశారు. ఒకే ఇంటి చిరునామాపై వందల ఓట్లు నమోదు చేశారు. ఒక బీజేపీ నేత ఇంట్లో 40 మంది ఓటర్లు ఉన్నట్లు చూపగా, తాము వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరని తెలిపారు.దాదాపు 4,000 మంది ఓటర్లకు ఫొటోలు లేవని, ఉన్నా అవి అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు.ఫారం 6 ద్వారా కొత్తగా చేర్చిన 34,000 ఓట్లలో చాలా మంది 89 నుంచి 95 ఏళ్ల మధ్య వయసు వారే ఉండటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.ఎన్నికల కమిషన్ రాజ్యాంగం కోసం పనిచేయాలి కానీ, బీజేపీ కోసం కాదని రాహుల్ గాంధీ హితవు పలికారు. దేశవ్యాప్త ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాను, పోలింగ్ వీడియో రికార్డింగ్లను విడుదల చేస్తే, ఈ మోసం కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా జరిగిందని నిరూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. ఈ పోరాటంలో తాను ఒంటరి కాదని, దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నాయని, ఈసీ వెంటనే డేటాను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa