ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ ను డీల్ చేయడంపై మోదీకి కొన్ని సలహాలు ఇస్తానంటున్న ఇజ్రాయెల్ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 05:56 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని సలహాలు ఇవ్వగలనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ తనకు అత్యంత సన్నిహితులని పేర్కొంటూ, ఈ విషయంలో తాను సహాయపడగలనని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత జర్నలిస్టుల బృందంతో మాట్లాడుతూ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. ట్రంప్‌తో డీల్ చేసే విషయంలో మోదీకి కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే, ఆ విషయాలను నేను బహిరంగంగా కాకుండా పర్సనల్ గా చెబుతాను" అని స్పష్టం చేశారు. త్వరలోనే తాను భారత్‌లో పర్యటించాలని ఆశిస్తున్నట్లు కూడా నెతన్యాహు తన మనసులోని మాటను బయటపెట్టారు.భారత ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఈ వాణిజ్య వివాదంపై నెతన్యాహు స్పందిస్తూ, అమెరికా-భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, సుంకాల సమస్యను ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమస్య పరిష్కారమైతే అది ఇజ్రాయెల్‌కు కూడా మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు పూర్తి సహకారం అందిస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. కాగా, గురువారం ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్‌తో నెతన్యాహు సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలుస్తోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa