ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ .. ఉగ్రవాదాన్ని మాత్రం పెంచిపోషించడం ఆపడం లేదు. పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రమూకలు.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిపిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. అయితే ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి.. పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. పాకిస్తాన్ విమానాలు.. మన ఎయిర్స్పేస్లోకి రాకుండా మూసివేసింది. గగనతలాన్ని భారత్ మూసివేయడంతో పాకిస్తా్న్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ భారీ నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వశాఖ.. ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో సమర్పించిన లెక్కలు ఈ నష్టానికి సంబంధించిన విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి.
భారత్ ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు.. తన ఎయిర్స్పేస్ను మూసి ఉంచడంతో 4.10 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు (మన భారత కరెన్సీలో దాదాపు రూ.126 కోట్ల) నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. భారత్ విధించిన ఆంక్షల నేపథ్యంలో నిత్యం 100-150 విమానాలపై ప్రభావం పడినట్లు తెలిపింది. ఈ కారణంగా విమానాల రాకపోకలు 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. దీని వల్ల పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీకి వచ్చే ఆదాయానికి పెద్ద గండి పడినట్లు వివరించింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో.. భారత్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు భారత ఎయిర్స్పేస్ను కూడా మూసివేసింది. ఇక పాకిస్తాన్ విమానాలు రాకుండా.. భారత్ తన గగనతలాన్ని మూసివేయగా.. దాన్ని తాజాగా ఆగస్ట్ 24వ తేదీ వరకు పొడిగించింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం తీవ్ర ఆందోళనకు గురి చేయగా.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్పై కఠిన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెంటనే దేశం విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఆ దేశ విమానాలు భారత గగనతలం మీదుగా వెళ్లకుండా ఆంక్షలు విధించింది. అంతకుముందే భారత విమానాలు ప్రయాణించకుండా.. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa