ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాట్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల నడుమ చోటు చేసుకుంటున్న పరిణామాలు, చర్చలు, సంభాషణల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. రష్యాతో ఇంధన వాణిజ్యం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియా మీద అమెరికా సుంకాలు 50 శాతానికి చేరాయి. అయినా సరే భారత్ మాత్రం ట్రంప్ నిర్ణయాలకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పింది. రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
ఈక్రమంలో శుక్రవారం నాడు భారత ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఆగస్టు 15న నాడు మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానుండటం.. అది కూడా భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఈ పరిణామం చోటు చేసుకోబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..
డొనాల్డ్ ట్రంప్ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీలకు సమయం, వేదిక ఖారరైంది. వీరిద్దరి భేటీకి అలస్కా వేదిక కానుంది. వచ్చే వారం అనగా ఆగస్టు 15న వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. పుతిన్తో భేటీకి ముందు ట్రంప్.. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లతో మాట్లాడనున్నారు. ట్రంప్-పుతిన్ భేటీలో ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు తెచ్చే దిశగా చర్చలు సాగనున్నాయి అంటున్నారు.
2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఫలితంగా లక్షలాది మంది తన నివాసాలను వదిలి వెళ్లారు. ఈ అంశంపై ఇప్పటివరకు మూడు సార్లు చర్చలు జరిగినా ఆశించిన ఫలితం లభించలేదు. ఈ క్రమంలో త్వరలోనే ట్రంప్ అలస్కాలో పుతిన్తో భేటీ సందర్భంగా ఈ సమస్యకు ఒక ముగింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భేటీ తర్వాత అయినా మరి సమస్య పరిష్కారం అవుతుందో లేదో చూడాలి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య భూభాగాలను మార్చుకోవడం ద్వారా ఈ యుద్ధాన్ని ఆపొచ్చని ట్రంప్ ఆలోచన. అంటే, రెండు దేశాలూ కొంత భూమిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే, శాంతి సాధ్యమవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కానీ, ఈ ఆలోచన ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి మరి. అయితే ట్రంప్, పుతిన్ భేటీ గురించి రష్యా అధ్యక్షుడు ఇంకా వివరణ ఇవ్వలేదు. పుతిన్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. మరి ట్రంప్తో భేటీ అవుతారో లేదో.. ఒకవేళ వీరిద్దరి మధ్య సమావేశం జరిగినా.. సమస్య పరిష్కారం అవుతుందో లేదో చూడాలి అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa