బ్యాంక్ అకౌంట్ ఇప్పట్లో ఒక ఇంట్లోనే దాదాపు నాలుగైదు ఉంటున్నాయి. చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్ దగ్గర్నుంచి.. ఉద్యోగం చేసే వారికి శాలరీ అకౌంట్.. మహిళలకు కొన్ని పథకాల ప్రయోజనాలు పొందేందుకు.. పెన్షన్ తీసుకునే వారికి ఇలా అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. సేవింగ్స్ అకౌంట్ ఉంటేనే సరిపోదు. అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలన్న సంగతి తెలిసిందే. నెలకు సగటున ఇంత నిర్వహించాలని ఆయా బ్యాంకులు మార్గదర్శకాలు రూపొందిస్తుంటాయి. ఇది గ్రామీణ, పట్టణ, మెట్రో ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. కానీ కొన్ని బ్యాంకులు ఇటీవల మినిమం బ్యాలెన్స్ నిబంధనలు ఎత్తేస్తున్నాయి. ఇందులో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకున్నా ఇబ్బంది లేదు.
కానీ ఇప్పుడు చాలా ప్రైవేట్ బ్యాంకులు యావరేజ్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ నిర్వహించాలని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రక్షా బంధన్ పండగ వేళ అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంకులకు భిన్నంగా.. సేవింగ్స్ అకౌంట్లలో కనీస సగటు నిల్వ (మినిమం యావరేజ్ బ్యాలెన్స్) మొత్తాన్ని పెంచేస్తున్నట్లు ప్రకటించింది. గ్రామీణ, అర్బన్, సెమీ అర్బన్, అర్బన్, మెట్రో ఇలా అన్ని బ్రాంచుల్లో ఖాతాదారులపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని పేర్కొంది. 2025, ఆగస్ట్ 1 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇప్పుడు సవరించిన నిబంధనల ప్రకారం.. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో నెలకు కనీసం రూ. 50 వేలు యావరేజ్ బ్యాలెన్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. గతంలో ఇది రూ. 10 వేలుగానే ఉండేది. దాదాపు 5 రెట్లు పెంచిందన్నమాట. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 5 వేల నుంచి రూ. 25 వేలకు పెంచింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే రూ. 2500 నుంచి రూ. 10 వేలకు పెంచేసింది. ఇక మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుంటే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐసీఐసీఐ కూడా అదే చెప్పింది. ఖాతా దారులు ఎప్పటికప్పుడు తమ అకౌంట్లలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలని.. సగటు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఛార్జీలు ఉంటాయని తెలిపింది.
ఇక్కడ అతిపెద్ద ఊరట ఏంటంటే.. ఇదివరకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి ఇబ్బందేం లేదు. 2025, ఆగస్ట్ 1, ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన వారు ఈ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలని వెల్లడించింది. అయితే.. ఇప్పట్లో ప్రముఖ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకే ఎక్కువ మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలని చెప్పడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇది గరిష్టంగా రూ. 10 వేలుగానే ఉంది. యాక్సిస్ బ్యాంకులో సగటున రూ. 12 వేలు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa