తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. బెంగుళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ టీటీడీకి భారీ విరాళం అందించింది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ తరుఫున ఆ సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.వి.ఎల్. నరసింహ రాజు టీటీడీకి రూ. 20 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు చొప్పున విరాళంగా సమర్పించారు. సోమవారం టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీని నరసింహరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.
ఆగస్ట్ 16న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు
మరోవైపు తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో ఆగస్ట్ 16వ తేదీన గోకులాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో టీటీడీ.. గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. శ్రీకృష్ణుడి పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ ఏటా గోకులాష్టమిని ఘనంగా నిర్వహిస్తుంది. శ్రీవేంకటేశ్వర గోశాలలో ప్రత్యేక ఏర్పాట్లను చేయనుంది. పందిళ్ళు, మామిడితోరణాలు, ముత్యాల రంగవల్లులు, పూలతో అలంకరించడమే కాకుండా గోవులను కూడా అందంగా అలంకరిస్తారు. అలాగే గోకులాష్టమి సందర్భంగా గోశాలకు వచ్చే భక్తులకు స్వయంగా ఆవులకు తినిపించేందుకు వీలుగా బెల్లం, బియ్యం, పశుగ్రాసం టీటీడీ సమకూరుస్తుంది.
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ఆగస్ట్ 16వ తేదీ ఉదయం 5 నుంచి 10.30 గంటల వేణుగానం నిర్వహిస్తారు, అలాగే భజనలు, కోలాటాల వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకూ గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. 11 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, దర్శనం, ప్రసాదం పంపిణీ ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. గోకులాష్టమి రోజున శ్రీవారి భక్తులు ఎస్వీగోసంరక్షణశాలను సందర్శించి.. గోపూజలో పాల్గొని శ్రీవారి సేవకు పాత్రులు కావాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa