ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద ఏపీ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో అధికార పగ్గాలు చేపట్టగానే పింఛన్ల పెంపు నిర్ణయాన్ని టీడీపీ కూటమి సర్కారు అమలు చేసింది. అయితే దివ్యాంగుల పింఛన్ల జారీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. వైకల్యం తక్కువగా ఉన్నవారు కూడా వైకల్యంగా ఎక్కువగా ఉన్నట్లు సర్టిఫికేట్ల ద్వారా చూపించి పింఛన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి అనర్హులపై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే దివ్యాంగ పింఛన్లలో అనర్హులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది.
2025 ఫిబ్రవరి నెల నుంచి సదరం శిబిరాలను నిర్వహిస్తు్న్నారు. దివ్యాంగ పింఛన్ పొందుతున్నవారిని పునఃపరిశీలించి.. వైకల్య శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారిని గుర్తించారు. సదరం శిబిరాలకు రావాలంటూ నోటీసులు జారీ చేయగా.. కొంతమంది గైర్హాజరయ్యారు. అలాంటి వారికి ఆగస్ట్ నెలలో పింఛన్లు అందించలేదు. అయితే కొంతమంది సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్ల సాయంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ చేయటంతో.. పింఛన్ సొమ్ము పొందగలిగారు.మరికొంతమంది లబ్ధిదారుల నుంచి నోటీసులపై ఎలాంటి స్పందనా లేదు. సదరం పునఃపరిశీలనకు రావాలంటూ సెర్ప్ జారీ చేసిన నోటీసులకు బదులు లేదు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి వారికి రెండోసారి నోటీసులు పంపిస్తున్నారు అధికారులు. సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించారు. తేదీలు, కేటగిరీల వారీగా నోటీసులు జారీ చేశారు.
మరోవైపు సదరం కేంద్రాలలో వైకల్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవటం వలన కూడా ఆగస్ట్ నెలలో కొంతమందికి పింఛన్లు రాలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. వైద్యుల కొరత, ఇతరత్రా కారణాలతో కొన్నిచోట్ల సదరం పునఃపరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఈ పునః పరిశీలన పూర్తి చేసి.. అనర్హులను ఏరివేసి, మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa