ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాకు ముప్పు వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం..: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్

international |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 08:24 PM

 భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సున్నితమైన సంబంధాల నేపథ్యంలో.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ముఖ్యంగా భారత్ నుంచి పాకిస్థాన్ మనుగడకు ముప్పు వస్తే... సగం ప్రపంచాన్ని తమ వెంట లాక్కుపోతాం అని బహిరంగంగా అణు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భయాందోళనలను రేకెత్తించాయి. అమెరికా గడ్డపై నిలబడి మూడో దేశంపై ఇంత తీవ్రమైన అణు హెచ్చరిక చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.


ఈ వ్యాఖ్యలు కేవలం నోటి మాటలకే పరిమితం కాలేదు. అసిమ్ మునీర్ తన ప్రసంగంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తావించారు. ఆ ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టిందంటూ ఆయన ఆరోపించారు. ఒకవేళ భారత్ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. పాకిస్థాన్‌లోని 250 మిలియన్ల ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా భారత్ ఇండస్ నదిపై ఏమైనా ఆనకట్టలను నిర్మించాలనుకుంటే.. వాటిని ధ్వంసం చేయడానికి తమ వద్ద క్షిపణులకు కొరత లేదని వెలల్డించారు. ఒక డ్యామ్‌ను కేవలం 10 క్షిపణులతో నాశనం చేయగలమని ఆయన హెచ్చరించారు.


అసిమ్ మునీర్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఒకవైపు తన దేశ భద్రత గురించి ఆయన మాట్లాడుతున్నా.. మరోవైపు ఒక బాధ్యతాయుతమైన సైనిక అధిపతి ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే విధంగా అణు హెచ్చరికలు చేయడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి బెదిరింపులు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు కలిగించడమే కాకుండా.. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆయన అమెరికా పర్యటనలో ఉండగానే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ వైఖరి ఎలా ఉందో తెలియజేస్తుంది.


ఈ వ్యాఖ్యలపై అమెరికా, భారత్‌ల నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. అయితే రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు దౌత్యపరమైన చర్చలకు దారితీసే అవకాశం ఉంది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన శాంతి ప్రయత్నాలకు గాను నోబెల్ బహుమతికి సిఫార్సు చేసినట్లు కూడా అసిమ్ మునీర్ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa