ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిషన్ సుదర్శన్ చక్ర ప్రారంభించిన మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 08:46 PM

భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తుకు మార్గదర్శనం చేసింది. ముఖ్యంగా ఆయన ప్రసంగంలో ' ఆత్మనిర్భర్ భారత్ ' లక్ష్యాన్ని మరోసారి నొక్కిచెబుతూ.. జాతీయ భద్రత కోసం ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. దాని పేరే ' మిషన్ సుదర్శన్ చక్ర '. రాబోయే పదేళ్ల కాలంలో దేశంలోని కీలక సంస్థలు, వ్యవస్థలకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ మిషన్‌ను తీసుకురాబోతున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ మిషన్ దేశ భద్రతలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని ప్రధాని పేర్కొన్నారు.


మిషన్ సుదర్శన్ చక్ర అంటే ఏమిటి?


'మిషన్ సుదర్శన్ చక్ర' అనేది బహుళ-స్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఒక జాతీయ కార్యక్రమం. అధునాతన నిఘా వ్యవస్థ, సైబర్ భద్రత, భౌతిక మౌలిక సదుపాయాల రక్షణ వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. సైబర్ యుద్ధాలు, హైబ్రిడ్ బెదిరింపుల వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ మిషన్ సిద్ధమవుతుంది. ఈ మిషన్ పూర్తిగా పరిశోధన ఆధారితంగా ఉంటుంది. అలలాగే దేశీయంగానే అభివృద్ధి చేయబడుతుంది. దీని ద్వారా భారత్ భవిష్యత్తులో భద్రతా వ్యవస్థల కోసం విదేశీ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, జాతీయ సార్వభౌమాధికారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.


ఈ మిషన్‌కు 'సుదర్శన్ చక్ర' అని పేరు పెట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. మహాభారతంలోని శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని ప్రేరణగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అసాధారణ పరిస్థితుల్లో సూర్యుడిని కప్పి ఉంచి.. ప్రజలను రక్షించడానికి ఉపయోగించినట్లు పురాణాలు చెబుతాయి. ఈ స్ఫూర్తితోనే 'మిషన్ సుదర్శన్ చక్ర' దేశానికి ఒక రక్షణ కవచంలా పని చేసి.. ఆధునిక సవాళ్ల నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇది భారత సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను మేళవించి.. రాబోయే దశాబ్దపు సవాళ్లకు భారత్‌ను సన్నద్ధం చేస్తుంది.


ప్రధాని మోదీ తన ప్రసంగంలో "ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నామని భావించాలి" అని నొక్కిచెప్పారు. అందుకోసమే ఈ మిషన్ తీసుకురాబోతున్నామని కూడా వివరించారు. వ్యూహాత్మకంగా, సమీకృత భద్రతా ప్రణాళికను రూపొందించి.. కేవలం ప్రతిచర్యలకు పరిమితం కాకుండా ముందస్తుగా ఎదుర్కొనే సంసిద్ధతను ఈ మిషన్ కల్పిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa