ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడ్రోజులు వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 10:25 PM

ఆంధ్రప్రదేశ్‌‍లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని.. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శనివారం రోజున విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.


మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శనివారం రోజున రాష్ట్రంలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా , విశాఖపట్నం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 2,98,209 క్యూసెక్కులు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టిందన్న విపత్తుల నిర్వహణ సంస్థ.. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల ప్రభావంతో హెచ్చుతగ్గులు ఉండొచ్చని తెలిపారు. పూర్తిస్థాయిలో తగ్గే వరకు నదులు, వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు అన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరగటంతో గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం కురవటంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బుధవారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో విజయవాడ వాసులు గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని భయపడిపోయారు. అయితే అలాంటి ప్రమాదమేమీ లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో మరో మూడు రోజులు వర్షాలు కొనసాగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa