ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. మద్దతు కోరుతూ జగన్‌కు కేంద్రమంత్రి ఫోన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 04:27 PM

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‍కు కేంద్రమంత్రి రాజ్‍నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై జగన్‌తో మాట్లాడారు.. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపారు. జగన్ ఇటీవల ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు.. దీంతో బీజేపీ చేసిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో నలుగురు.. రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఖరారయ్యారు. ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన తమిళనాడుకు చెందినవారు. సీపీ రాధాకృష్ణన్ గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న ఓబీసీ నేత. తమిళనాడులోని గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాధాకృష్ణన్ రెండుసార్లు కోయంబత్తూరు నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నడ్డా విపక్షాలకు పిలుపునిచ్చారు. ఎన్డీయేకు లోక్‌సభ, రాజ్యసభలో బలం ఉండటంతో రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే అని టాక్ వినిపిస్తోంది.


దక్షిణాది రాష్ట్రాల నాయకులకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా బీజేపీ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాధాకృష్ణన్ దక్షిణాది బీజేపీలో సీనియర్ నాయకుడు. ఆరెస్సెస్‌ మద్దతు కూడా ఉంది. 2026లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి.


ఈ కారణాల వల్ల బీజేపీ రాధాకృష్ణన్‌ను వైపు మొగ్గుచూపిందా అనే చర్చ జరుగుతోంది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అంటున్నారు.


తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీయే పక్షాలకు రాధాకృష్ణన్ ధన్యవాదాలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించారని.. తనపై ఉంచిన నమ్మకానికి భావోద్వేగానికి గురయ్యానన్నారు. దేశం కోసం తన తుదిశ్వాస వరకూ పనిచేస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa