ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ దాడుల భయంతో కరాచీని ఖాళీ చేసిన పాకిస్థాన్ నేవీ, బయటకొచ్చిన శాటిలైట్ ఫొటోలు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 05:35 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. మే 7 తేదీ తెల్లవారుజామున చేపట్టిన ఈ మిషన్ కేవలం 25 నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తిచేసి.. భారత్ సైన్యం వెనక్కి వచ్చింది. అంతేకాదు, తమ ఆపరేషన్ పూర్తయిన విషయాన్ని పాకిస్థాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్ (DGMO)కు కూడా సమాచారం ఇచ్చింది. అయితే, పాకిస్థాన్ నాయకత్వం బలమైన ప్రతీకారం గురించి మాట్లాడటంతో స్పందించింది. కానీ, ఇండియా టుడే ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) బృందం విశ్లేషించిన కరాచీ, గ్వాదర్ పోర్టుల శాటిలైట్ ఫోటోలు ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ నౌకదళం రక్షణాత్మక ధోరణిని అవలంబించినట్టు స్పష్టమైంది.


మే 7న చేపట్టిన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఉపగ్రహ ఫోటోల ప్రకారం.. పాకిస్థాన్ నేవీ (PN) యుద్ధనౌకలను కరాచీలోని తమ డాక్‌యార్డ్ నుంచి వాణిజ్య టెర్మినల్స్‌లోకి తరలించింది. ఇంతలో ఇతర యుద్ధనౌకలు భారత తూర్పు వైపు ప్రయాణించే బదులు ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 100 కి.మీ దూరంలో ఉన్న పశ్చిమ పోర్టు గ్వాదర్‌కు వెళ్తున్నట్టు కనిపించింది.


తీవ్ర ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ నేవీ ఆపరేషనల్ సంసిద్ధతను ఆర్మీ ఉన్నతస్థాయి వర్గాలు ప్రశ్నించాయి. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కరాచీ నౌకాశ్రయంపై జరిగిన సాహసోపేత దాడిలో పాల్గొన్న ఇండియన్ నేవీ రిటైర్డ్ కమాండర్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్సీ సురేష్ బంగార మాట్లాడుతూ.. ‘‘మే 7న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాం.. పాకిస్థాన్ త్రివిధ దళాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. కానీ, పాక్ యుద్ధనౌకలు అప్పటికీ నౌకాశ్రయంలో ఉండటం బట్టి అతి తక్కువ కార్యాచరణ సంసిద్ధతను సూచిస్తుంది’ అని అన్నారు.


అంతేకాదు, పాక్ నేవీ నౌకలు వాణిజ్య టెర్మినల్‌లో డాకింగ్ చేయడాన్ని బట్టి ఆపరేషన్ సిందూర్ సమయంలో వాణిజ్య నౌకలను పాకిస్థాన్ రక్షణకవచంగా మార్చుకున్నట్టు అర్ధమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘వాణిజ్య టెర్మినల్‌లో డాకింగ్ చేయడం అంటే క్షిపణి దాడుల నుంచి తప్పించుకోవడమనే సంకేతం.. వాణిజ్య విమానాలకు దగ్గరగా వారి సైనిక విమానాలను ఎగురవేయడం వంటి చర్యలు సహా పౌర ఆస్తులను ఫణంగా పెట్టే పాక్ ప్రవృత్తిని ఇది సూచిస్తుంది’ అని పేర్కొన్నారు.


కాగా, ఆపరేషన్ సిందూర్‌కు కేవలం ఆరు నెలల ముందు.. పాకిస్థాన్ నేవీ దేశీయంగా అభివృద్ధి చేసిన అధునాతక బాలిస్టిక్ క్షిపణి P282ని నౌకదళంలో చేరినట్టు ప్రకటించింది. 350 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ బాలిస్టిక్ క్షిపణి అధిక ఖచ్చితత్వంతో దాడులు చేయగలదని ప్రగల్భాలు పలికింది. కానీ, ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పుడు మాత్రం మరో కథ చెప్పింది. అంతరిక్ష సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ సేకరించి హై-రిజల్యూషన్ ఫోటోలు ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 100 కి.మీ. దూరంలో ఉన్న గ్వాదర్ పోర్టు వద్ద యుద్ధ నౌకలను డాక్ చేసినట్టు నిర్ధారించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa