ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు నెలల్లో 6 యుద్ధాలు ఆపేశా,,, ట్రంప్ ప్రకటన

international |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 10:32 PM

ప్రస్తుత రాజకీయ ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఆయన తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్ ద్వారా.. ఆరు నెలల వ్యవధిలోనే తాను ఆరు యుద్ధాలను అపేశానని ప్రకటించాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశానికి ముందు చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతేకాదు ఈ ఘనతకు గాను తనకు నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ లభిస్తుందని కూడా ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అసలు ట్రంప్ ముగించానని చెబుతున్న ఆరు యుద్ధాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


అర్మేనియా-అజర్‌బైజాన్ వివాదం..


అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య నగొర్నో-కరాబఖ్ ప్రాంతంపై ఉన్న వివాదాన్ని తానే పరిష్కరించినట్లు ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల నాయకులను సమావేశపరిచి మరీ ఈ ఘర్షణలను ముగించేందుకు ఒక ఒప్పందం కుదిర్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగానే 'ట్రంప్ రూట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ' అనే కొత్త రవాణా మార్గాన్ని కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.


2025 జూన్‌లో ఇరాన్‌ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ట్రంప్ జోక్యం చేసుకుని తాత్కాలిక కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు నేరుగా ట్రంప్‌యే తెలిపారు. ఒప్పందం చేసుకోకుంటే మరింత భయంకరమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను హెచ్చరించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.


ఈజిప్ట్-ఇథియోపియా నైలు నది వివాదం..


నైలు నదిపై గ్రాండ్ రివైవల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఈజిప్ట్-ఇథియోపియా మధ్య ఉన్న దశాబ్దాల పాత వివాదాన్ని కూడా తాను ముగించానని ట్రంప్ పేర్కొన్నారు.


రువాండా-కాంగో రిపబ్లిక్ మధ్య శాంతి ఒప్పందం..


2025 జూన్ 20వ తేదీన ట్రంప్.. రువాండా-డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. ఈ ప్రయత్నంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో సహాయం చేశారని కూడా ఆయన తెలిపారు.


భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు..


2025 మే నెలలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఏర్పడిన అణు ఘర్షణను కూడా తాను అడ్డుకున్నానని ట్రంప్ బలంగా నొక్కి చెప్పారు. ఈ వాదనను పాకిస్థాన్ బహిరంగంగా సమర్థించింది. అంతేకాకుండా ఈ కారణమే చూపిస్తూ.. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేసింది. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో ట్రంప్ పాత్రను తీవ్రంగా ఖండించింది. ఇందులో మూడో పక్షం జోక్యమే లేదని తేల్చి చెప్పింది.


థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దు ఘర్షణ..


ఆగస్టు ప్రారంభంలో థాయ్‌లాండ్-కంబోడియా దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణను ఆపేందుకు ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నట్లు వివరించారు. దీనికి ప్రతిఫలంగా కంబోడియా ప్రధాని హున్ మానేట్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా నామినేట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa