ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనవడి బారసాలకు వచ్చి.. తిరిగి వెళ్తూ.. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు.

Crime |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 10:47 PM

 విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి బస్సు అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్లాట్‍‌ఫామ్ మీదకు దూసుకెళ్లిన బస్సు.. అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతురాలు శృంగవరపుకోటకు చెందిన గేదెల ముత్యాలమ్మగా గుర్తించారు. మనవడి బారసాల కోసం గాజువాక గోపాల్‌రెడ్డి నగర్‌లో ఉన్న కూతురి ఇంటికి వచ్చిన ముత్యాలమ్మ.. తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్ ఎక్కడం కోసం ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చారు. 25వ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రీకాకుళం డిపోకు చెందిన విశాఖ - శ్రీకాకుళం 925 సర్వీస్ బస్సు ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముత్యాలమ్మ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.


మరోవైపు అప్పటి వరకూ తమతో పాటుగా బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవటంతో మిగతా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బ్రేక్ ఫెయిల్ వలనే ప్రమాదం జరిగిందా? లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు బస్సు ఫిట్‌నెస్ బాగానే ఉన్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తెలిపారు. అప్పటికే రెండు ట్రిప్పులు తిరిగినట్లు తెలిపారు. బస్ డ్రైవర్‌కు ఆల్కహాల్ టెస్ట్ కూడా జరిగిందని.. ఆయన మద్యం సేవించి లేరని వెల్లడించారు. బస్ డ్రైవర్ చంద్రరావుకు పదేళ్ల అనుభవం ఉందన్న ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ రీజనల్ మేనేజర్.. ప్రైవేట్ బేస్‌లో అతన్ని నియమించుకున్నట్లు తెలిపారు.


మరోవైపు సోదరులకు రాఖీ కట్టి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తన కొడుకును కోల్పోయిన ఘటన తగరపువలస పరిధిలో చోటుచేసుకుంది. తగరపువలస నమ్మివానిపేటకు చెందిన నవ్య.. రాఖీపండగ రావటంతో తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ఆరిలోవ రవీంద్రనగర్‌‌లోని పుట్టింటికి శనివారం వెళ్లారు. సోదరులకు రాఖీ కట్టిన తర్వాత శనివారం రోజున స్కూటీపై తిరిగి వస్తున్న సమయంలో.. చంద్రంపాలెం హైస్కూలు సమీపంలోకి వచ్చేసరికి ఆర్టీసీ బస్సు స్కూటీని రాసుకుంటూ వెళ్లింది. దీంతో స్కూటీ అదుపు తప్పి కిందపడిపోయింది.


ఈ ప్రమాదంలో నవ్య, ఆమె కుమార్తెకి స్వల్పగాయాలు కాగా.. 11 ఏళ్ల ప్రణవ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కన్నబిడ్డ కళ్లముందే చనిపోవటంతో ఆ కన్నతల్లి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ప్రణవ్ మృతదేహానికి విశాఖ కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చిట్టివలస శ్మశానవాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa