ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తోంది. జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు వరదలపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సూచనలు జారీ చేస్తోంది.
మరోవైపు మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.6 అడుగులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 7.40 లక్షల క్యూసెక్కులు ఉందని.. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులు ఉందని వెల్లడించింది. బుధవారం నాటికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించింది.
జిల్లాలకు నిధులు..
మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు 16 జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. మంగళవారం రోజున విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.విజయలక్ష్మి.. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నదుల ఉద్ధృతి, జిల్లాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని.. వారి కోసం నిత్యావసరాలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యల కోసం గుంటూరు, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేశారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa