దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం రోజు ఉదయం దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. పేపర్లు ముఖ్యమంత్రికి అందించిన తర్వాత దాడికి పాల్పడ్డాడు. ముఖ్యంగా ఆమె ముఖంపై కొట్టి, జుట్టు పీకి మరీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తి, అతని ఉద్దేశం గురించి పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తపై దాడికి పాల్పడిన వ్యక్తి గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన 41 ఏళ్ల రాజేష్ సకారియాగా పోలీసులు గుర్తించారు. అతను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు.. తన జైలులో ఉన్న బంధువును విడిపించడంలో సహాయం చేయమని అడగడానికి వచ్చాడని పోలీసులు చెప్పారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆవేశానికి లోనై దాడికి దిగినట్లు తాము భావిస్తున్నట్లు వివరించారు. కానీ మరోవైపు అతడి కుటుంబ సభ్యులను ఈ విషయం గురించి ఆరా తీయగా.. మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రాజేశ్కు కుక్కలు అంటే చాలా ఇష్టమని, ఇటీవలే సుప్రీం తీర్పుతో అతడు తీవ్ర నిరాశకు లోనయ్యాడని అతడి తల్లి భాను వివరించింది. ఈ విషయంపై కోపంతోనే అతడు సీఎంపై దాడి చేసి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించే 'జన్ సునాయి' కార్యక్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందన్నారు. రాజేష్ సకారియా కొన్ని పత్రాలను తీసుకుని ముఖ్యమంత్రి రేఖా గుప్తా వద్దకు వెళ్లాడని పేర్కొన్నారు. కొంతసేపు ఇద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత.. రాజేష్ అకస్మాత్తుగా ముఖ్యమంత్రిపై అరుస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డాడని చెప్పారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. దాడి సమయంలో రాజేష్ మద్యం సేవించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పినప్పటికీ.. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.
ఈ ఘటన తరువాత, పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే భద్రతా లోపంపై కూడా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఈ విచారణను పోలీసు కమిషనర్ ఎస్బీకే సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ నాయకులు ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. అసలు సీఎంపై రాజేశ్ ఎందుకు దాడి చేశాడనేది తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే. రాజేశ్ నోరు విప్పి చెబితే తప్ప ఇందుకు సంబంధించి అసలు కారణం తెలిసేలా లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa