ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నక్సలిజాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రోత్సహించారు.... అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 08:20 PM

ఇండియా కూటమి ఉప-రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోం మంత్రి అమిత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించేలా తీర్పులు ఇచ్చారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏర్పడిన సల్వా జుడుంపై నిషేధం విధిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒకరని గుర్తుచేశారు. అప్పట్లో ఈ తీర్పు ఇవ్వకపోయింటే దేశంలో నక్సలిజం పూర్తిగా నశించిపోయేదని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జగదీప్ దన్ఖడ్ రాజీనామాతో ఉప-రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 9న ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు.


కేరళలో శుక్రవారం ఓ న్యూస్ కన్క్లేవ్ ప్రారంభోత్సవానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించే తీర్పులిచ్చారని విమర్శించారు. ‘‘నక్సలిజానికి సహకరించిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి... ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వా జుడుం దళానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు.. మావోయిస్టులపై పోరాటానికి గిరిజన యువతను ప్రత్యేక పోలీసు అధికారులుగా వినియోగించడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే వారిని నిరాయుధులను చేయాలని ఆదేశించారు.. అప్పట్లో ఆ తీర్పు ఇచ్చి ఉండకపోతే, 2020 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతరించేది’’ అన్నారు.


కాగా, ఉప-రాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంతో, కేరళలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు తగ్గిపోయాయని అమిత్షా జోస్యం చెప్పారు. ‘‘కేరళ కూడా మావోయిస్ట్ బాధిత రాష్ట్రం.. కానీ కమ్యూనిస్ట్‌ల ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ నక్సలిజానికి మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది.. దీన్ని కేరళ ప్రజలు కచ్చితంగా వ్యతిరేకిస్తారు’ అని అమిత్షా అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్షన్ పోటీలో ఉన్నారు.


కాగా, మావోయిస్టు ఉద్యమానికి వ్యతిరేకంగా ఏర్పడిన సల్వా జుడుం లేదా మరేదైనా దళంలో గిరిజన యువతను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2011లో తీర్పు వెలువరించింది. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ నందిని సుందర్, ఇతరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై 2011 డిసెంబరులో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఐదో తరగతి మాత్రమే ఉత్తీర్ణులైన యువతకు ఆయుధాలు ఇవ్వడం, వారిని పోలీసులుగా గుర్తించడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో ఛత్తీస్‌గఢ్‌లో సల్వాం జుడంను అప్పటి బీజేపీ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ తీర్పు ప్రభావమే ఇప్పటి వరకూ మావోయిస్ట్ ఉద్యమం కొనసాగడానికి కారణమని పరోక్షంగా అమిత్ షా వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa