ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్లర్క్, ప్యూన్‌లకు ఒక రూల్.. సీఎం, పీఎంలకు ఒక రూలా.. ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 08:21 PM

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, మంత్రులు ఎవరైనా నెల రోజులకు పైగా జైలులో ఉంటే.. వారిని పదవుల నుంచి తొలగించేందుకు.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


మరికొన్ని రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. గయాజీలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్, ఆర్జేడీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఉంటే జైలులో లేకపోతే బెయిల్‌ తీసుకుని బయటికి వచ్చి ఉన్నారని సెటైర్లు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే.. వారి ఉద్యోగం పోతుందని గుర్తు చేశారు. క్లర్క్, ప్యూన్ వంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రూల్.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు ఇంకో రూలా అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు.


ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలపై కేసులు ఉన్నాయని.. అందుకే అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో భాగంగా తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. 50 గంటలు జైలు శిక్ష అనుభవించే ప్రభుత్వ ఉద్యోగిని.. తన ఉద్యోగం నుంచి తొలగిస్తున్నప్పుడు.. జైలు శిక్ష అనుభవించిన ఒక ముఖ్యమంత్రి గానీ, ఒక ప్రధానమంత్రి గానీ, మంత్రులు గానీ తమ పదవి నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని ప్రధాని ప్రశ్నించారు. జైలులో ఉండి.. పాలన కొనసాగిస్తారా అని నిలదీశారు.


కొన్ని రోజుల క్రితం కొందరు నాయకులు.. జైళ్ల నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆదేశాలు ఇవ్వడం మనం చూశామని.. పరోక్షంగా ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. అవినీతి చేసిన నేతలే ప్రజలను పరిపాలిస్తే.. ఇక దేశంలో పెరిగిపోతున్న అవినీతిని ఎలా నిర్మూలిస్తాం అంటూ మోదీ ప్రశ్నలు వేశారు. ఇక నుంచి అలాంటి క్రిమినల్‌ నాయకులకు.. ప్రజలను పాలించే అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టానికి ఎవరూ అతీతులు కారని ఇందులో ప్రధానమంత్రి కూడా ఉంటారని స్పష్టం చేశారు.


ఎవరైనా ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులపై తీవ్రమైన నేరారోపణలు వచ్చి.. 30 రోజులపాటు జైలులో ఉంటే వారిని పదవి నుంచి తొలగించేలా రూపొందించిన బిల్లును ఇటీవలె అమిత్‌ షా లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దాన్ని జేపీసీ పరిశీలనకు పంపించారు. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడిన నేతలు అరెస్ట్ అయి.. నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించేలా ఈ బిల్లులో నిబంధన పెట్టారు. వారు రాజీనామా చేయకపోయినా ఈ చట్టం ప్రకారం ఆటోమేటిగ్‌గా పదవిని కోల్పోతారు. అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్ష పాలిత సీఎంలపై, మంత్రులపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే ఇలాంటి బిల్లును తీసుకువస్తోందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa