నగర శివారు గ్రామంలోని ఓ ఇంటి గేటు తెరిచి లోపలికి వెళ్లిన అధికారులు.. అక్కడ సెటప్ చూసి అవాక్కయ్యారు. ఆ ఇంటిలో ఏకంగా కొన్ని కోట్లు విలువైన డ్రగ్స్ తయారుచేసే ఫ్యాక్టరీ నడుపుతున్న తీరుచూసి విస్మయం చెందారు. అంతేకాదు, మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ అనుచరుల్లో ఒకడి ఆదేశాలతో ఇది నడుస్తోన్నట్టు తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగర శివారులోని జగదీశ్పుర గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 16న గ్రామంలోని 11వ నెంబరు ఇంటిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో క్రైమ్ థ్రిల్లర్ కథకు మించిన రహస్యం బయటపడుతుందని వాళ్లు ఊహించి ఉండరు. కోట్లాది రూపాయల సింథటిక్ డ్రగ్ ఫ్యాక్టరీని కనుగొన్నారు. ఆ ఇంటిలో రూ.92 కోట్ల విలువ చేసే 61.20 కిలోల లిక్విడ్ మెఫెడ్రోన్తో పాటు 541 కిలోలకు పైగా ముడి కెమికల్స్ లభ్యమయ్యాయి.
కిడ్నాప్లు, గ్యాంగ్ వార్లు, కిరాయి హత్యలతో దశాబ్దాలపాటు ముంబయిను వణికించి దావూద్ ఇబ్రహీమ్ ముఠా.. నిఘాను పటిష్ఠం చేయడంతో తమ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు మార్చింది. నిఘా వర్గాల అంచనా ప్రకారం.. దావూద్ అతడి అనుచరుల సలీమ్ డోలా ఇస్మాయిల్, ఉమైద్ ఉర్ రెహ్మాన్ పాకిస్థాన్, దుబాయ్ల నుంచి నిధులను పంపుతూ.. అధిక లాభాలు గడించే ‘మ్యావ్, మ్యావ్’ పేరుతో డ్రగ్స్ దందా నడుపుతున్నారు.
స్మగ్లర్ ఇక్బాల్ మిర్చికి అత్యంత నమ్మకస్తుడైన సలీమ్ డోలా.. ముంబయి, గుజరాత్లోని దావూద్ కంపెనీలతో పాత పరిచయాలను వాడుకుని ప్రస్తుతం టర్కీ నుంచి మొత్తం నెట్వర్క్ను నడుపుతున్నట్టు అనుమానిస్తున్నారు. అతడికి మేనల్లుడు ముస్తాఫ్ కుబ్బవాలా కుడి భుజంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జగదీశ్పురలో అత్యంత పకడ్బందీగానే ఫ్యాక్టరీని నడుపుతున్నట్టు అక్కడ పరిస్థితి బట్టి అర్ధమవుతోంది. మిక్సింగ్ మెషీన్లు, కెమికల్ రియాక్టర్లు, ఉష్ణోగ్రత నియంత్రణ ఛాంబర్లను గుర్తించారు. ఫార్మసీ డిప్లొమా చేసి, శిక్షణ పొందిన ఫైజల్ ఖురేషీ, అతడి సన్నిహితుడు రజాక్ ఖాన్ దీనిని నడుపుతున్నారు.
సలీం డోలా ఆదేశాలతో భివాండీ, థానే నుంచి మిథిలీన్ డైక్లోరైడ్, అసిటోన్, మోనోమెతిలమైన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, వంటి కెమికల్స్ మినీ ట్రక్కుల ద్వారా తీసుకొచ్చినట్టు దర్యాప్తులో గుర్తించారు. 400 కిలోల కెమికల్స్ను ముంబయి నుంచి భోపాల్కు తరలించినట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ నెట్వర్క్లో స్థానికులు కూడా ఉన్నట్టు తేలింది. అలాగే, ఏడేళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఆ ఇంటికి దాడికి రెండు రోజుల ముందే అంటే ఆగస్టు 14న కరెంట్ మీటర్ కనెక్షన్ రావడాన్ని బట్టి అధికారులు లంఛాలు తీసుకుని పనిచేసినట్టు అర్ధమవుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, రూ.100 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేయడం కేవలం ఓ శాంపిల్ మాత్రమేనని, దావూద్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా తన డ్రగ్స్ నెట్వర్క్ను పెద్ద మొత్తంలోనే విస్తరించి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa