అమెరికా, పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఎన్నడూ లేని విధంగా సత్సంబంధాలు నెలకొంటున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికా వెళ్లడం, వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో భేటీ కావడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అంతేకాకుండా అసిమ్ మునీర్తోపాటు పాకిస్తాన్ను ట్రంప్ గత కొంతకాలంగా పొగడటం.. పాకిస్తాన్లో ఉన్న భారీ చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి అమెరికా సహాయం అందిస్తుందని ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ చేసిన దాడులను ఆపేందుకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య రోజురోజుకూ స్నేహపూర్వక సంబంధాలు పెరుగుతున్న వేళ.. వారి బంధంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో మాట్లాడిన జైశంకర్.. పాకిస్తాన్, అమెరికా దేశాలకు ఓ చరిత్ర ఉందని.. గతంలో జరిగిన ఘటనలను విస్మరించిన చరిత్ర కూడా ఆ రెండు దేశాలదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ను అమెరికా హతమార్చిన ఘటనను గుర్తు చేశారు. పాకిస్తాన్లోని అబోటాబాద్లో అమెరికా సైన్యం నిర్వహించిన ఆపరేషన్ గురించి జైశంకర్ వ్యాఖ్యానించారు. పాక్, అమెరికాలకు పరస్పర చరిత్ర ఉందని.. అంతేకాదు ఆ గతాన్ని మరిచిపోయిన చరిత్ర కూడా వారిదేనని పేర్కొన్నారు. మనం ఇలాంటివి చూడటం ఇదేం కొత్త కాదని.. ఇదే అమెరికా సైన్యం అబోటాబాద్కు వెళ్లి ఎవర్ని గుర్తించిందో మనందరికీ తెలుసని బిన్ లాడెన్ను చంపిన ఘటన గురించి జైశంకర్ వ్యాఖ్యానించారు.
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడికి సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో దాక్కోగా.. అమెరికా సైన్యం మట్టుపెట్టిన విషయాన్ని పరోక్షంగా జైశంకర్ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యాలు ఏరకంగా పని చేస్తున్నాయనే విషయంపైనా జై శంకర్ వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు అవకాశవాద రాజకీయాలు చేస్తూనే ఉంటాయని.. అందులో కొన్ని వ్యూహాత్మకంగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉండవచ్చని పేర్కొన్నారు. ఇలాంటప్పుడు అమెరికాతో సంబంధాలు, ఏవి ముఖ్యం అనే అంశాలపైనే భారత్ దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.
ఇక కేవలం అమెరికా కోసమే పాకిస్తాన్లో తాము ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు ఏకంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంగీకరించడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్.. పశ్చిమ దేశాల కోసమే 30 ఏళ్లుగా తాము ఉగ్రవాదానికి మద్దతు పలికినట్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామని.. చివరకు అది తాము చేసిన తప్పు అని తెలిసొచ్చిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa