కూకట్పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలుడు సహస్రను దారుణంగా హత్య చేశాడు. ఇక ఈ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు పక్కా పథకం ప్రకారమే బాలిక సహస్రను హత్య చేశాడని.. ఆ తర్వాత తన గురించి ఎవరికి తెలియకుండా.. ఎంతో తెలివిగా వ్యవహరించి తమనే బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు. ఇక ఈకేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్లు కీలక వివరాలు వెల్లడించారు.
సీపీ అవినాష్, డీసీపీ సురేష్ కుమార్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మృతురాలు ఇంట్లో ఉన్న బ్యాట్ దొంగతనం చేయడం కోసమే నిందితుడు వారి ఇంటికి వెళ్లాడని తెలిపారు. నిందితుడైన బాలుడు.. సహస్ర వాళ్ల ఇంట్లో కిచెన్లో ఉన్న బ్యాట్ని తీసుకుని బయటకు వస్తుండగా.. అక్కడే కూర్చుని టీవీ చూస్తున్న సహస్ర అతడిని చూసి దొంగా.. దొంగా అని అరిచిందని.. దీంతో కంగారుపడ్డ బాలుడు.. సహస్ర అరుపులు ఎవరైనా వింటే వచ్చి తనను చూస్తారని భయపడి ఆమెను కిందకు తోశాడని తెలిపారు. ఆ వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో సహస్రపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడని పోలీసులు వెల్లడించారు.
ఆ తర్వాత నేరం కప్పిపుచ్చుకోవడానికి బాలుడు చాలా తెలివిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. హత్యకు వాడిన కత్తిని కడిగి దాచాడని.. అలానే తన టీ షర్ట్పై రక్తపు మరకలు పడ్డాయని.. తల్లిదండ్రులకు తెలియకుండా వాటిని కవర్ చేసుకుని ఇంట్లోకి వెళ్లి.. స్నానం చేసిన తర్వాత షర్ట్ని వాషింగ్ మెషిన్లో వేసినట్లు వెల్లడించారు. ఇక బాలుడి వద్ద దొరికిన లేటర్ ఇప్పుడు రాసింది కాదని.. ఎప్పుడో నెల క్రితం రాశాడని.. పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా నిందితుడు పోలీసులను తప్పు దారి పట్టించాడని చెప్పుకొచ్చారు.
అయితే బాలుడు కేవలం బ్యాట్ దొంగతనం కోసమే బాలిక ఇంటికి వెళ్లాడని.. డబ్బులు దొంగతనం చేయలేదని పోలీసులు తెలిపారు. అలానే బాలుడు స్కూల్కి సరిగా వెళ్లేవాడు కాదని.. యూట్యూబ్, ఓటీటీల్లో క్రైమ్, థ్రిల్లర్ మూవీలు చూసి.. తనదైన లోకంలో ఉండే వాడని.. వాటి ప్రభావంతోనే దొంగతనానికి ప్లాన్ వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద కత్తి, లేఖ దొరికిందని తెలిపారు. అయితే బాలుడి తల్లి ముందుగానే దీని గురించి నిందితుడిని ప్రశ్నించిందని.. అప్పుడు నిందితుడు నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావని అన్నాడని నిందితుడి తల్లి తెలిపిందని పోలీసులు చెప్పుకొచ్చారు.
బ్యాట్ కోసం హత్య చేయాలా అని ప్రశ్నిస్తే.. నిందితుడు చెప్పిన సమాధానం తమను ఆశ్చర్యపరిచిందని పోలీసులు తెలిపారు. బాలిక తమ్ముడితో కలిసి క్రికెట్ ఆడినప్పుడు.. నిందితుడు ఆ బ్యాట్పై ముచ్చటపడ్డాడు. అడిగితే ఇవ్వకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. మీ నాన్నను కొనివ్వమని అడిగితే పోయేది కదా.. దొంగతనం ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తే.. తన తండ్రి జాబ్ చేయడం లేదని.. అమ్మ చిన్న ఉద్యోగం చేస్తోందని తెలిపాడు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. అందుకే ఇలాంటి విషయాలు అడిగి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక అడగలేదు అని బాలుడు విచారణలో తెలిపాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని జువైనల్ హోమ్కి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa