టీమిండియా వెటరన్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా.. భారత క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు ఆదివారం (ఆగస్టు 23, 2025) రోజు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 2010లో టీమిండియా తరఫున టెస్ట్ డెబ్యూ చేసిన ఈ 37 ఏళ్ల పుజారా.. తన కెరీర్లో మొత్తంగా 103 టెస్టు మ్యాచులు ఆడాడు. టీమిండియా తరఫున పుజారా చివరగా 2023 జనవరిలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
"భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన చేయడం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభవాలు. ఏదో ఒక సమయంలో ఇలాంటి మంచి విషయాలకు వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. భారత్ తరఫున అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యా. నా కెరీర్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా దేశం, నా రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా" అని పుజారా పోస్టు పెట్టాడు.
ఇదే సమయంలో బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు పుజారా కృతజ్ఞతలు చెప్పాడు. "నా ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. సహచర క్రికెటర్లు, సపోర్ట్ స్టాఫ్, నెట్ బౌలర్లు, అనలిస్ట్లు, లాజిస్టిక్లు, అంపైర్లు, గ్రౌండ్ స్టాఫ్ ఇంకా చాలా మంది ఎంతో సహకరించారు. ముఖ్యంగా నా భార్య పూజ, నా కుమార్తె అదితి. ఇకపై నా కుటుంబంతో మరింత సమయం గడిపేందుకు ప్రయత్నిస్తా" అని పుజారా పేర్కొన్నాడు.
కాగా 37 ఏళ్ల పుజారా 2010లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో భారత్ తరఫున.. 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు సాధించాడు. స్వదేశంలో తన మొత్తం టెస్టుల్లో 52.58 సగటుతో 3,839 పరుగులు చేశాడు. 2023 జూన్లో ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పుజారా చివరి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa