ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1971 నాటి వివాదాలపై మళ్లీ రాజుకున్న విభేదాలు: పరిష్కారమయ్యాయన్న పాక్, కాదంటున్న బంగ్లాదేశ్

international |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 09:39 PM

అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అనేది తరచుగా చర్చనీయాంశమవుతుంటుంది. ఇటీవలే పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌తో తమకు ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నామంటూ ప్రకటించగా.. బంగ్లా మాత్రం అదేమీ లేదని చెప్పింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ పర్యటించగా.. ఈక్రమంలోనే ఆయన చేసిన ఒక ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. 1971 నాటి యుద్ధానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రెండు సమస్యలు "రెండుసార్లు పరిష్కారం అయ్యాయి" అని ఆయన చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ వెంటనే తిరస్కరించింది. ఇది రెండు దేశాల మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న చారిత్రక విభేదాలను, దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది.


1971లో తూర్పు పాకిస్థాన్‌గా ఉన్న బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ సైన్యం జరిపిన అణచివేత, ఊచకోత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన దురాగతాలకు పాకిస్థాన్ అధికారికంగా క్షమాపణ చెప్పాలని బంగ్లాదేశ్ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని కీలకమైన సమస్యలలో ఒకటి. పాకిస్థాన్ అధికారిక క్షమాపణ, ఆస్తుల పంపిణీ వంటి మూడు ప్రధాన సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని బంగ్లాదేశ్ చెబుతోంది.


బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ సమస్యలపై మాట్లాడారు. 1971 నాటి మూడు సమస్యలలో రెండు సమస్యలు "రెండుసార్లు పరిష్కారం అయ్యాయి" అని ఆయన అన్నారు. ఆ సమస్యలలో ఊచకోతకు క్షమాపణ వంటివి కూడా ఉన్నాయని ఆయన పరోక్షంగా సూచించారు. అయితే ఇషాక్ దార్ చేసిన ఈ వ్యాఖ్యలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విదేశాంగ సలహాదారు టౌహిద్ హుస్సేన్ వెంటనే ఖండించారు. ఈ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, భవిష్యత్తులో ఈ అంశాలపై చర్చలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. హుస్సేన్ వ్యాఖ్యలు పాకిస్థాన్ వాదనలో నిజం లేదని, ఆ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని నిరూపించాయి.


పాకిస్తాన్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు, దానికి బంగ్లాదేశ్ ఇచ్చిన స్పందన రెండు దేశాల మధ్య ఉన్న లోతైన అపనమ్మకాన్ని, చారిత్రక గాయాలను సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ తమ వైపు నుంచి ఈ వివాదాలకు ముగింపు పలకాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్ ప్రభుత్వం, ప్రజలు ఈ సమస్యలను విస్మరించడానికి సిద్ధంగా లేరని తెలుస్తుందన్నారు. ఒకవైపు పాకిస్థాన్ ఈ సమస్యలను పరిష్కరించామని అంటుండగా, బంగ్లాదేశ్ మాత్రం వాటిని ఇంకా చర్చించాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ వైరుధ్యం రెండు దేశాల సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉన్నాయో తెలియజేస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa