దాదాపు ఆరు దశాబ్దాల పాటు భారతీయ ప్రకటనల ప్రపంచాన్ని ఏలిన 'అమూల్ గర్ల్' ఐకానిక్ చిహ్నం వెనుక ఉన్న రహస్యం ఎట్టకేలకు వీడింది. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ సోదరి శోభా థరూరే ఈ 'అమూల్ గర్ల్' బొమ్మకు స్ఫూర్తి అని సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.. స్వయంగా అమూల్ కంపెనీనే అసలు నిజాన్ని బయట పెట్టింది. ఈ ఒక్క ప్రకటనతో ఆ ఐకానిక్ మాస్కాట్ గురించి ఇంతకాలం ఉన్న ఊహాగానాలకు తెరపడింది.
అమూల్ గర్ల్ పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందంటూ ఓ వ్యక్తి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన వివరించిన ప్రకారం.. 1966లో పాల ఉత్పత్తుల రంగంలో 'పోల్సన్ బట్టర్' అనే సంస్థ అమూల్కు ప్రధాన పోటీదారుగా ఉండేది. ఆ సంస్థకు దీటుగా అమూల్ తన ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఒక బొమ్మను సృష్టించాలని నిర్ణయించుకుంది. ప్రముఖ ప్రకటనల సంస్థ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్ కంపెనీ (ఏఎస్పీ)కి చెందిన సిల్వెస్టర్ డి'కూన్హా.. అతని బృందం ఈ పనిని చేపట్టింది. ఇలస్ట్రేటర్ యూస్టేస్ ఫెర్నాండెజ్ 'అమూల్ గర్ల్' ఫైనల్ స్కెచ్ను రూపొందించారు. దీనికి 'అట్టర్లీ, బట్టర్లీ, డెలీషియస్' అనే క్యాచీ స్లోగన్ను డి'కూన్హా భార్య నిషా డి'కూన్హా ఇచ్చారు.
అయితే ఈ మాస్కాట్ తయారీలో అసలు స్ఫూర్తిని ఇప్పటి వరకు గోప్యంగా ఉంచారని.. ఈ ఫొటో అసలైన ప్రేరణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సోదరి శోభా ధరూర్ అని వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇందుకు సాక్ష్యాలుగా శోభాకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. దీంతో అంతా అది నిజమేనని భావించారు. మేము నమ్మలేకపోతున్నాం, ఇంత కాలానికైనా అసలు కథ చెప్పినందుకు థాంక్స్ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేశారు. ఈక్రమంలోనే ఓ నెటిజెన్.. ఈ వీడియోను షేర్ చేస్తూ అమూలు కంపెనీకి ఇది నిజమేనా అని అడిగారు.
మరోవైపు ఈ వైరల్ వీడియో క్లిప్ చూసి శోభా థరూర్ సైతం ఈ వీడియోపై స్పందించారు. అవును నేను మొదటి అమూలే బేబీని అంటూ రాసుకొచ్చారు. శ్యామ్ బెనెగల్ ఆ ఫొటోలు తీశారని పేర్కొన్నారు. అలాగే తన సోదరి ఫొటోలను కూడా ఆ తర్వాత వాడుకున్నారని వివరించారు. అయితే తన ఛాయాచిత్రం మిస్టర్ ఫెర్నాండెజ్ తర్వాత మస్కట్ను రూపొందించడానికి ప్రత్యక్షంగా ప్రేరణను ఇచ్చిందో లేదో మాత్రం తనకు తెలియదని అన్నారు.
అయితే ఈ వీడియో చూసిన అమూలు కంపెనీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. వీడియోలో చెబుతున్నట్లుగా శశిథరూర్ సోదరి శోభా.. అమూల్ గర్ల్ చిహ్నానికి ప్రేరణ కాదని చెప్పుకొచ్చింది. అలాగే ఆ ఐకానిక్ చిహ్నాన్ని సిల్వెస్టర్ డి కున్హా మరియు చిత్రకారుడు శ్రీ యూస్టేస్ ఫెర్నాండెజ్ సృష్టించారని స్పష్టం చేసింది. అమూల్ ఇచ్చిన క్లారిటీతో అసలు నిజాలు వెలుగులోకి రాగా.. నెటిజెన్లు అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా తప్పుడు సమాచారంతో వీడియో చేసి పోస్ట్ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజం తెలియకుండా.. ఇలా చేయడం తప్పని, ఇక మీదట ఇలాంటి పనులు చేయొద్దంటూ సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa