ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుచానూరులో అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రాధాకృష్ణన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 07:22 PM

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం నాడు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆయన అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఇక్కడికి వచ్చారు. గత వారమే నామినేషన్ దాఖలు చేసిన ఆయన, తన గెలుపు ఖాయమనే అంచనాల నడుమ ఈ పర్యటన చేపట్టారు.ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు, ఏపీ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, "ఈరోజు వినాయక చవితి పర్వదినం. ఇంతటి పవిత్రమైన రోజున పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను" అని తెలిపారు.అంతకుముందు, రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ నాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, దివాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటు వేసే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa