ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివకుమార్ అలా చేసి ఉండాల్సింది కాదని కానీ క్షమాపణ చెప్పారని వెల్లడి

national |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 08:29 PM

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించిన వివాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ విషయం ఇక ముగిసిన అధ్యాయమని, దీన్ని ఎవరూ అనవసరంగా పెద్దది చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఖర్గే, పార్టీలో ఎవరూ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం చేయరాదని హితవు పలికారు.ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో, ప్రతిపక్ష నేత ఆర్. అశోక్‌ను ఆటపట్టించేందుకే తాను ఆర్ఎస్ఎస్ గీతంలోని కొన్ని పంక్తులను పాడానని శివకుమార్ వివరణ ఇచ్చారు. అయితే, ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీయడంతో ఆయన వెనక్కి తగ్గారు. తన చర్య వల్ల పార్టీ సహచరులు లేదా ఇండియా కూటమి మిత్రులు ఎవరైనా బాధపడి ఉంటే, వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని మంగళవారం ప్రకటించారు. తాను జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే ఉంటానని, గాంధీ కుటుంబం పట్ల తన విధేయత దేవుడిపై భక్తుడికి ఉండే విశ్వాసం లాంటిదని ఆయన స్పష్టం చేశారు.మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, "శివకుమార్ అలా అని ఉండాల్సింది కాదు, కానీ అనేశారు. ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. కాబట్టి, ఇప్పటికే ముగిసిపోయిన ఈ విషయాన్ని నేను మళ్లీ తెరవను. మీడియా కూడా దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దు" అని అన్నారు.మరోవైపు, ఆర్ఎస్ఎస్ గీతం పాడినందుకు డీకే శివకుమార్ క్షమాపణ చెప్పడంపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ స్పందిస్తూ, "భారతమాతను కీర్తించే 'నమస్తే సదా వత్సలే మాతృభూమే' గీతాన్ని పాడినందుకు శివకుమార్ క్షమాపణ చెప్పాల్సి వస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రకారం భారతీయులు ఎవరిని కీర్తించాలి ఇటలీ నుంచి వచ్చిన మహిళనా అని తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ఈ పరిణామంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa