దివంగతురాలైన తన తల్లి హీరాబెన్ను ఉద్దేశించి బీహార్ లో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంతో స్పందించారు. అది కేవలం తన తల్లికి జరిగిన అవమానం కాదని, దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణులను కించపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపించింది.మంగళవారం నాడు బీహార్కు చెందిన సుమారు 20 లక్షల మంది మహిళలతో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు పాల్గొన్న సభలో నా తల్లిని దూషించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. బీహార్ ప్రజలు కూడా ఈ వ్యాఖ్యలతో బాధపడ్డారని నాకు తెలుసు" అని అన్నారు.తన తల్లి పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ, "మా బట్టల కోసం ప్రతి పైసా కూడబెట్టింది. అనారోగ్యంతో ఉన్నా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారు. తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది" అని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. రాజకుటుంబాల్లో పుట్టిన రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్లకు ఒక పేద తల్లి పడిన బాధ, ఆమె కొడుకు చేసే పోరాటం అర్థం కావని విమర్శించారు. అధికారం కోసం స్వార్థంతో పనిచేస్తున్నారని, ప్రజలు తనను ఆశీర్వదించి ప్రధానిని చేస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.మోదీ తల్లిపై వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa