రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అక్కసుగా భారత్ మీద సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా భారత్ మీద పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కేవలం సెకండరీ టారిఫ్లను మాత్రమే విధించానని.. ఇంకా 2,3 విడతలను చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికే భారత్ మీద 50 శాంత సుంకాలతో మోత మోగిస్తున్న ట్రంప్.. త్వరలోనే సేవల విభాగంపై టారిఫ్లు విధించేందుకు రెడీ అవుతున్నారు.
వాణిజ్యపరంగా ఇండియా మీద మరింత ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ అనుకూలంగా ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే భారత్ ఎగుమతుల మీద భారీగా సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడు ఇండియన్ ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్ల మీద కూడా సుంకాలు విధించనున్నారు. తాజాగా అమెరికా ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సలహాదారు పీటర్ నవారూ మాట్లాడుతూ.. అన్ని ఔట్సోర్సింగ్ సర్వీసుల మీద కూడా టారిఫ్ విధించాలి అని అభిప్రాయపడటం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్.. తిరిగి ఇండియా మీదే విమర్శలు చేయడం గమనార్హం. ఇండియా టారిఫ్లతో అమెరికాను చంపేస్తుంది అన్నారు. అలానే చైనా, బ్రెజిల్లు కూడా సుంకాలతో అమెరికాను చంపేస్తున్నాయని ఆరోపించారు. ఇండియా అత్యధిక సుంకాలు విధించే దేశం. అలాంటిది ఇప్పుడు తన విధానాలకు భయపడి.. సుంకాలను పూర్తి రద్దు చేస్తామంటూ ముందుకు వచ్చింది. ఒక వేళ అమెరికా టారిఫ్లను విధించకపోతే భారత్ ఎప్పటికి ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్.. అమెరికా మీద అత్యధిక సుంకాలను విధించింది. దీనివల్ల అమెరికా.. ఇండియాతో ఎక్కువగా వ్యాపారం చేయలేకపోయింది. కానీ భారత్ మాత్రం అమెరికాతో బాగానే వ్యాపారం చేసింది. అయినా మనం ఇండియా మీద సుంకాలు విధించలేదు. దీంతో భారత్ నుంచి ఉత్పత్తులు వరదలా వచ్చిపడ్డాయి అని చెప్పుకొచ్చారు.
అలానే చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షులు మీద కూడా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు దేశాల అధ్యక్షులైన జిన్పింగ్, పుతిన్, కిమ్జోంగ్ ఉన్లపై అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ట్రంప్ ఆరోపించారు. బుధవారం చైనా ఆయుధ ప్రదర్శన నిర్వహించిన నేపథ్యంలో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ఒక పోస్టు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా తరఫున పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలని ట్రంప్ కోరారు. అలానే చైనా అధ్యక్షుడు, ఆదేశ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa