ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రకోటలో భారీ దొంగతనం.. ఏకంగా రూ.1 కోటి విలువైన బంగారు కలశాలు చోరీ

national |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 10:10 PM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత భద్రత కలిగిన ఎర్రకోటలో ఈ దొంగతనం జరగడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఎర్రకోటలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించగా.. అందులో ఈ దొంగతనం జరిగింది. అక్కడ నిర్వహించిన పూజలో ఉంచేందుకు ఓ వ్యాపారి.. బంగారు కలశాలు తీసుకురాగా.. అవి చోరీకి గురయ్యాయి. దీంతో ఆ బిజినెస్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి.. విచారణ చేపట్టారు. ఎర్రకోటలో ఉన్న సీసీటీవీలను చెక్ చేయగా.. ఓ వ్యక్తి ఆ కలశాలను తీసుకెళ్లడం రికార్డ్ అయింది. అయితే ఆ దొంగను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు విస్తృత గాలింపు ఆపరేషన్ చేపట్టారు.


ఈనెల 3వ తేదీన ఉదయం ఎర్రకోటలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధీర్ కుమార్ జైన్ అనే ఒక బిజినెస్‌మెన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజ కోసం కొన్ని సామాగ్రిని సుధీర్ కుమార్ జైన్ తీసుకువచ్చారు. ఇందులో రెండు కలశాలు ఉన్నాయి. అందులో ఒకటి 760 గ్రాముల బరువైన బంగారు కలశం ఉంది. ఇక మరో 115 గ్రాముల చిన్న కలశం కూడా ఉంది. ఈ చిన్న కలశాన్ని వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగారు. అయితే పూజ పూర్తి అయ్యేవరకు ఆ కలశాలు అక్కడే ఉన్నాయి.


ఆ పూజకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. దీంతో పూజ పూర్తి అయిన తర్వాత.. అంతా కొద్దిసేపు పక్కకు వెళ్లిపోయారు. తిరిగి వచ్చేసరికి.. ఆ పూజలో ఉంచిన రెండు విలువైన కలశాలు కనిపించలేదని సుధీర్ కుమార్ జైన్ గుర్తించారు. దీంతో వెంటనే ఎర్రకోట నిర్వాహకులకు కలశాల దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. పూజ అయిపోయిన తర్వాత బయటికి వెళ్లి వచ్చేలోపే ఈ చోరీ జరిగిందని సుధీర్ కుమార్ జైన్ వెల్లడించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు సుధీర్ కుమార్ జైన్ ఫిర్యాదు చేశారు.


ఎర్రకోటలో చోరీ జరిగిందనే సమాచారం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఎర్రకోటలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజీలో సంచలన దృశ్యాలు కనిపించాయి. పూజ గదిలో ఎవరూ లేని సమయాన్ని గమనించిన.. ఓ వ్యక్తి అక్కడ ఉన్న రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత అతడు ఆ కలశాల సంచితో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు ఆ దృశ్యాల్లో కనిపించాయి.


దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ నిందితుడిపై ఇప్పటికే పలు దేవాలయాల్లో దొంగతనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ దొంగ.. కలశాలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa