ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయి బాంబు బెదిరింపుల కేసులో షాకింగ్ ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 10:09 PM

గణేష్ నిమర్జనం వేడుకలకు ఒక్క రోజు ముందు అంటే శుక్రవారం రోజు ముంబయి నగరం మొత్తం ఒక్కసారిగా ఉగ్రవాద భయంతో వణికిపోయింది. నగర ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు శుక్రవారం రోజు మధ్యాహ్నం ఓ భయంకరమైన సందేశం వచ్చింది. అందులో.. 34 మానవ బాంబులతో ఉగ్రవాదులు నగరాన్ని పేల్చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రంమలోనే ఇవన్నీ నకిలీ బెదిరింపులుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇదంతా చేసింది ఓ 51 ఏళ్ల జ్యోతిష్యుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇక ఇలా అతడు చేయడం వెనుక కారణం తెలుసుకుని అయితే ముక్కున వేలేసుకున్నారు. మరి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?


ముంబయి ట్రాఫిక్ పోలీసులకు శుక్రవారం రోజు వచ్చిన ఆ సందేశంలో.. నగరంలో 34 మానవ బాంబులు ఉన్నాయని, 14 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించారని ఉంది. అంతేకాకుండా 400 కిలోల ఆర్‌డీఎక్స్‌తో పేలుళ్లు జరగవచ్చని కూడా ఆ సందేశంలో హెచ్చరించారు. 'లష్కరే జిహాది' అనే పేరుతో ఈ బెదిరింపు సందేశం వచ్చింది. అయితే గణేష్ నిమర్జనం వేడుకలకు ఒక్కరోజు ముందు ఈ బెదిరింపు రావడంతో పోలీసులు ముంబైని అప్రమత్తం చేసి.. నిమర్జనం మార్గాలలో భద్రతను పెంచారు.


మరోవైపు పోలీసులు ఈ సందేశాన్ని ఎవరు, ఎందుకు పంపారో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా సైబర్ ట్రాకింగ్ ద్వారా కొన్ని గంటల్లోనే సందేశాలు పంపిన వ్యక్తిని గుర్తించారు. అతడి లొకేషన్ తెలుసుకుని వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. అలాగే అతడి వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఆరు మెమోరీ కార్డు హోల్డర్లు, రెండు డిజిటల్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై విచారణ జరపగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేరు అశ్వినీ కుమార్ అని పోలీసులు తెలిపారు. అతడి వయసు 51 ఏళ్లు కాగా.. ఇతడు బీహార్‌లో పాటలీపుత్రకు చెందిన వాడని వెల్లడించారు. అలాగే ఇతను గత ఐదేళ్లుగా నోయిడాలో నివసిస్తున్నట్లు చెప్పారు.


అంతేకాకుండా అతడు ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడడం వెనుక పెద్ద కారణమే ఉందన్నారు. ముఖ్యంగా తన స్నేహితుడు ఫిరోజ్‌ను ఇరికించేందుకే ఈ సందేశాలు పంపినట్లు అశ్నినీ కుమార్ అంగీకరించాడని అన్నారు. 2023లో ఫిరోజ్ పాట్నాలోని ఫుల్‌వారి షరీఫ్‌లో అశ్వినిపై ఒక కేసు పెట్టగా.. దీంతో అశ్వినీ మూడు నెలల పాటు జైలులో గడపాల్సి వచ్చిందన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్న అశ్వినీ.. ఫిరోజ్‌ను ఇరికించడానికి అతడి పేరిట ఉగ్రవాద బెదిరింపు సందేశాన్ని పంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈక్రమంలోనే శుక్రవారం రోజ సందేశాలు పంపాడని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa