ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ టారిఫ్‌ల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని దూరం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 09:58 PM

భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ సుంకాలతో రెచ్చిపోతున్నారు. అదే సమయంలో భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ దేశ ప్రయోజనాల కోసం.. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తామని తేల్చి చెబుతోంది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను నిలిపివేయాలని ట్రంప్ చేస్తున్న హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోని భారత్.. చమురు కొనుగోళ్లను సాగిస్తోంది.


దీంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినగా.. మళ్లీ ఇటీవలె ట్రంప్ తన మాట మార్చారు. భారత్ తమకు మిత్రదేశమని పేర్కొనడం గమనార్హం. అయితే చైనా వేదికగా జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సమావేశం తర్వాత ట్రంప్ తన వైఖరి మార్చుకోవడం గమనార్హం. అయితే చైనాలో పర్యటించిన ప్రధాని మోదీ .. అమెరికా పర్యటనకు దూరం కావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.


సెప్టెంబరు 9వ తేదీ నుంచి అమెరికాలో 80వ ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ సెషన్‌ ప్రారంభం కానుంది. ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య దేశాల ప్రతినిధుల హై లెవల్ సమావేశాలు జరగనున్నాయి. మొదట బ్రెజిల్‌ దేశాధినేత ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఐక్యరాజ్యసమితి షెడ్యూల్ విడుదల చేసింది. ట్రంప్ తర్వాత భారత మంత్రి ప్రసంగం ఉంటుందని ఆ షెడ్యూల్‌లో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదని అర్థం అవుతోంది. ఇక ప్రధాని మోదీ స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పుడు విడుదల చేసిందే ఫైనల్ షెడ్యూల్ కాదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈనెల 23వ తేదీన ప్రారంభం కానున్న సమావేశాలకు ముందు మరికొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. చైనా, ఇజ్రాయెల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల అధినేతలు కూడా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని మాట్లాడనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.


అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందంటూ పేర్కొన్న ట్రంప్‌.. ఇటీవల 50 శాతం సుంకాలను విధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ప్రధాని మోదీ దూరం అవుతారనే వార్తలు రావడం గమనార్హం. అయితే ఇటీవల 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa