ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయిలో డ్రోన్‌లపై నిషేధం.. అక్టోబర్ 5 వరకు అనుమతి బంద్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 09:55 PM

పండుగల సీజన్‌లో భద్రతను పటిష్టం చేయడానికి ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అక్టోబర్ 5వ తేదీ వరకు డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ విమానాలు, ఇతర ఎగిరే వస్తువులపై నిషేధం విధించారు. ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని ముంబై పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నిషేధ ఉత్తర్వులను జారీ చేశారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం, దేవీ నవరాత్రి ఉత్సవాలు వంటి పెద్ద పండుగల నేపథ్యంలో భద్రతాపరమైన ముప్పులను నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నారు.


పోలీసుల ఉత్తర్వుల ప్రకారం.. సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 5వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఈ నిషేధాజ్ఞలు కేవలం డ్రోన్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. రిమోట్ కంట్రోల్డ్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, పారాగ్లైడర్లు, పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, హాట్ ఎయిర్ బెలూన్‌లు వంటి అన్ని రకాల ఎగిరే వస్తువులకు వర్తిస్తాయి. శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబయి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) విశాల్ ఠాకూర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.


ప్రతి సంవత్సరం పండుగల సమయంలో ముంబైలో ప్రజల రాకపోకలు, జనసమ్మర్థం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గణేష్ విగ్రహాల నిమర్జనం రోజున లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తారు. ఈ సమయంలో డ్రోన్ల వంటి వస్తువులను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ పరికరాలను అసాంఘిక శక్తులు అవాంఛనీయ కార్యకలాపాలకు, ఉగ్రవాద దాడులకు ఉపయోగించే ప్రమాదం ఉందని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి.. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధాన్ని విధించారు.


అయితే నిషేధాలను ఉల్లంఘించిన వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డ్రోన్లను ఎగరవేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల లక్ష్యం పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడమేనని పోలీసులు తెలిపారు. ముంబై గతంలో అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొంది. అందుకే ప్రతి చిన్న భద్రతా ముప్పును కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు.


ఈ నిషేధాజ్ఞలు ముంబైలో పండుగల సంబరాలను పర్యవేక్షించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన చర్య. గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా వంటి పండుగల సమయాలలో ఇలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం సాధారణమే. కానీ డ్రోన్‌ల విస్తృత వినియోగం నేపథ్యంలో వాటిపై నియంత్రణ పెట్టడం తప్పనిసరిగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa