ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ సోదరిపై అత్తింటి వారి పైచాచికం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 01:50 PM

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫరూఖాబాద్ బీజేపీ ఎంపీ ముఖేశ్ రాజ్‌పుత్ సోదరిపై ఆమె అత్తింటివారు నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. కర్రలతో ఆమెను దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.యూపీలోని ఎటా జిల్లా రాణి అవంతిబాయి నగర్‌లో ఎంపీ ముఖేశ్ రాజ్‌పుత్ సోదరి రీనా రాజ్‌పుత్‌కు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా అత్తింటివారు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా, ఆమె స్నానం చేస్తుండగా మామ, మరిది రహస్యంగా వీడియో తీశారని రీనా ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించి వారిని ప్రశ్నించగా తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తొలుత ఇంట్లో తుపాకీ మడమతో మామ తనను కొట్టారని, అక్కడి నుంచి తప్పించుకుని బయటకు పరుగెత్తగా వీధిలో మరిది ఇనుప రాడ్డుతో దాడి చేశాడని రీనా వాపోయారు. అనంతరం ఇద్దరూ కలిసి అందరూ చూస్తుండగానే కర్రలతో దారుణంగా కొట్టారని ఆమె తెలిపారు. "నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే కారణంతో చాలా కాలంగా నన్ను వేధిస్తున్నారు. ఇంట్లోంచి పంపించేయాలని చూస్తున్నారు. స్నానం చేస్తుండగా వీడియో తీస్తుంటే, నేను అడ్డుకున్నానని అందరి ముందు నన్ను, నా కూతురిని చితకబాదారు" అని రీనా ఆవేదన వ్యక్తం చేశారు.చుట్టుపక్కల వారు చూస్తున్నప్పటికీ ఎవరూ తనను కాపాడేందుకు ముందుకు రాలేదని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని, అత్తింటివారి నుంచి రక్షణ కల్పించాలని అధికారులను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa