ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారికి ష్యూరిటీ లేకుండానే రూ.2 లక్షల వరకూ రుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 07:23 PM

భారతదేశం.. వ్యవసాయ ఆధారిత దేశం.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేది వ్యవసాయ రంగం అయితే.. దేశానికి అన్నం పెట్టేది రైతన్నలు. అలాంటి రైతుల కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వాటి అమలు ఎలా ఉందనేదీ పక్కనబెడితే, వాటిపై సరైన ప్రచారం, అవగాహన లేక రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనేది మాత్రం వాస్తవం. మన దేశంలో వ్యవసాయం తర్వాత.. రైతులు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయ ఆధారిత రంగాలపైనే. అంటే పాడిపరిశ్రమ.. గొర్రెల పెంపకం వంటి పనుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా రంగాలకు కూడా ఊతమిచ్చేలా ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పాడిరైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఓ కొత్త కార్యక్రమం ((పశు కిసాన్ క్రెడిట్ కార్డు) తీసుకువచ్చాయి.


పాడిరైతులకు రూ.2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా లోన్లు మంజూరు చేస్తున్నాయి. పాడి రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో లీడ్ బ్యాంక్ మేనేజర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యల పెంపకం చేపట్టిన రైతులకు రుణాలు అందిస్తున్నారు. అయితే రుణాలు కావాల్సిన రైతులు ప్రభుత్వ రంగ బ్యాంకులలో దరఖాస్తులు చేసుకోవాలి. అలా చేసుకున్న రైతు 15 శాతం డబ్బులు చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని ఆయా బ్యాంకులు పూచీకత్తు లేకుండానే లోన్ల రూపంలో అందిస్తున్నాయి. రుణం మొత్తాన్ని నెలవారీ వాయిదాల రూపంలో రైతు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తమ ఆవులు, గేదెలకు కూడా వారే ఇన్సూరెన్స్ ప్రీమియం భరించాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాంకులు సకాలంలో పాడిరైతులకు రుణాలు అందించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు.


మరోవైపు రైతుల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తుండగా.. కేంద్రం పీఎం కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ బీమా యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నాయి. వీటి ద్వారా సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాలు ఉద్దేశం. మరోవైపు పూచీకత్తు లేకుండా బ్యాంకులు అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని పాడి రైతులను అధికారులు కోరుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa