ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై సుంకాలు విధించడం సరైందేనన్న జెలెన్‌స్కీ

international |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 09:11 PM

ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం ఇప్పుడు ఆర్థిక రంగంలోనూ కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా భారీగా సుంకాలను విధిస్తున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ గట్టిగా సమర్థించారు. రష్యాకు ఆర్థికంగా నష్టం కలిగించడమే ఈ సుంకాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన 'సుంకాల విధానం సరైనదే' అని చెబుతూ.. భారత్‌ను పరోక్షంగా వ్యతిరేకించారు.


అమెరికన్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే ఏ దేశమైనా యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లేనని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి అవసరమైన నిధులను రష్యా తన చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోందని అన్నారు. అందుకే ఈ వ్యాపారాన్ని అడ్డుకోవడమే రష్యాను అణచివేయడానికి సరైన మార్గమని ఉక్రెయిన్ నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ సమాజం రష్యాకు అన్ని విధాలా సహకారాన్ని నిలిపివేయాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న భారత్‌ను టార్గెట్ చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.


ఇదిలా ఉండగా.. 50 శాతం సుంకాల భారం ఎదుర్కొంటూనే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుండగా.. ఇండియా నుంచి ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డీజిల్ కొనుగోలు చేస్తోంది. భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఉక్రెయినే ముందుండటం గమనార్హం. ఉక్రెయిన్ చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ నాఫ్టోరైనోక్ ప్రకారం.. 2025 జులైలో ఉక్రెయిన్ మొత్తం డీజిల్ దిగుమతుల్లో భారత్ 15.5 శాతం సరఫరా చేసింది. ఇది అన్ని దేశాల నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే ఎక్కువ. ముఖ్యంగా 2024 జనవరి నుంచి జులై మధ్య ఉక్రెయిన్‌కు డీజిల్ సరఫరాలో భారత్ వాటా కేవలం 1.9 శాతం మాత్రమే కాగా.. ఇప్పుడు మాత్రం అది 10.2 శాతానికి చేరుకుంది.


'ఏ దేశం నుంచి ఏదైనా కొంటాం.. అది మా హక్కు'


భారత్ తన జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, తక్కువ ధరకు లభిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ విషయంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ.. "ఏ దేశం నుంచి చమురు కొనాలి, ఎంత ధరలో కొనాలి అనేది మాకు మాత్రమే సంబంధించిన అంశం. ఇది సార్వభౌమత్వ దేశపు హక్కు" అని వాదించింది. అయితే అమెరికా అధికారులు మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 'సెకండరీ శాంక్షన్స్' విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇరు దేశాలపై మాత్రమే ప్రభావం చూపడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. జెలెన్‌స్కీ వంటి నాయకులు తమ మనుగడ కోసం ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడాన్ని సమర్థిస్తుండటం గమనార్హం. ఇది మాత్రమే కాకుడా జెలెన్‌‌ స్కీ.. పుతిన్ ఆహ్వానాన్ని నిరాకరించారు. తమ దేశంపై దాడులు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాద దేశానికి తాను వెళ్లలేనని స్పష్టం చేశారు. కావాలంటే మీరే కీవ్‌కు రండి అంటూ పుతిన్‌కు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa