ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించబతోతున్నాం: ట్రంప్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 09:13 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అత్యంత భారీ వైమానిక దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. "మీరు రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నారా?" అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్.. "అవును, నేను సిద్ధమే" అని స్పష్టంగా సమాధానమిచ్చారు. ఈ ప్రకటన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక మలుపుగా మారింది.


ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మానవ రహిత డ్రోన్లు, క్షిపణులతో భీకరమైన దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు పౌరులు మరణించగా.. కీవ్‌లోని ప్రభుత్వ భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మూడు సంవత్సరాల యుద్ధ చరిత్రలో మొదటిసారిగా రష్యా ఇంతటి భారీ దాడికి పాల్పడింది. ఈ దాడితో ఉక్రెయిన్ రాజధానిపై దట్టమైన పొగ కమ్ముకుంది. అనేక భవనాలకు మంటలు అంటుకుని ధ్వంసం అయిపోయాయి. అయితే ఈ దాడులపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ దాడులను "పచ్చి నేరం"గా అభివర్ణించారు.


 రష్యా దౌత్య మార్గాలను అపహాస్యం చేస్తోందని యూరోపియన్ యూనియన్ కూడా విమర్శించింది. ఈ నేపథ్యంలోనే రష్యాను దౌత్య చర్చలకు బలవంతంగా తీసుకురావాలంటే ఆర్థికంగా మరింత ఒత్తిడి తేవాలని అమెరికా భావిస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ప్రకటనలో.. రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ సంయుక్తంగా రెండో దశ ఆంక్షలు విధించవచ్చని సూచించారు. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై "సెకండరీ శాంక్షన్స్" విధించడం ద్వారా రష్యాకు వచ్చే ఆదాయ మార్గాలను మూసివేయవచ్చని చెప్పారు. ఈ చర్యలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చల బల్ల వద్దకు తీసుకువస్తాయని బెస్సెంట్ అభిప్రాయ పడ్డారు.


రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తున్న దేశాలపై డొనాల్డ్ ట్రంప్ అగ్రదేశం భారత్‌ను కూడా పరోక్షంగా విమర్శించారు. ఈ కారణంగా భారత్‌పై 50 శాతం సుంకం విధించామని తెలిపారు. ఇది భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆయన ఒక గొప్ప నాయకుడని కూడా ట్రంప్ పేర్కొనడం గమనార్హం.


మొత్తంగా ట్రంప్ తన అధ్యక్ష పదవిలోకి రాగానే 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “ఇది మానవత్వానికి జరిగిన ఘోరమైన నష్టం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యాపై ఆంక్షలు విధించడంలో ఇప్పటివరకు ఎవరూ తమంత కఠినంగా వ్యవహరించలేదని.. ఇప్పుడు రెండో దశ ఆంక్షలు కూడా విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీని వల్ల రష్యాపై మరింత ఒత్తిడి పెరిగి చర్చలకు వస్తారని అన్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa