టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ను పూర్తిగా భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించింది. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఊతమివ్వడమే కాకుండా, దేశాన్ని ప్రీమియం పరికరాల తయారీ కేంద్రంగా నిలబెడుతుందని నిపుణులు బుధవారం అభిప్రాయపడ్డారు.భారత్లో ఐఫోన్ల తయారీని విస్తరించడం ద్వారా యాపిల్ అనేక ప్రయోజనాలు పొందనుంది. పూర్తిగా తయారైన ఫోన్లను దిగుమతి చేసుకుంటే విధించే 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ భారం నుంచి కంపెనీ తప్పించుకోగలుగుతుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని తన భాగస్వాములైన ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా ఈ ఉత్పత్తి ప్రక్రియను చేపట్టనుంది.గ్రాంట్ థార్న్టన్ భరత్ సంస్థకు చెందిన నిపుణుడు క్రిషన్ అరోరా మాట్లాడుతూ, "ఈ నిర్ణయం వల్ల భారత్లో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి, ఎగుమతులు ఊపందుకుంటాయి. హై-టెక్ తయారీ రంగంలో మన దేశ విశ్వసనీయత మరింత బలపడుతుంది" అని వివరించారు. అమెరికాలో సుంకాల పెరుగుదల వంటి భవిష్యత్ సవాళ్ల నుంచి కూడా యాపిల్ తనను తాను కాపాడుకునేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందని ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కూడా యాపిల్కు కలిసివస్తోంది. ఈ పథకం కింద, భారత్లో తయారు చేసి విక్రయించే ఫోన్లపై 5 ఏళ్లపాటు 4 నుంచి 6 శాతం నగదు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ ప్రోత్సాహకాలతో యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. 2025 ప్రథమార్ధంలో ఎగుమతులు గత సంవత్సరంతో పోలిస్తే 53 శాతం పెరిగి 2.39 కోట్ల యూనిట్లకు చేరాయి.అయితే, ఈ నిర్ణయం వల్ల భారతీయ వినియోగదారులకు ఐఫోన్ల ధరలు వెంటనే తగ్గే అవకాశం లేకపోవచ్చని క్రిషన్ అరోరా స్పష్టం చేశారు. మరోవైపు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడి రాయితీలు, సులభతరమైన పర్యావరణ అనుమతులు, తక్కువ ధరలకే భూమి వంటి ప్రోత్సాహకాలు అందిస్తూ యాపిల్ తయారీ ప్రణాళికలకు మద్దతుగా నిలుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa