ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఒక తాజా అధ్యయనం హెచ్చరించింది. వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ఆసియా, అమెరికా ఖండాల్లోని అనేక దేశాల్లో డెంగీ కేసుల సంఖ్య ఏకంగా 76 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. వాతావరణ మార్పులకూ, డెంగీ వ్యాప్తికీ మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని ఈ అధ్యయనం స్పష్టంగా బయటపెట్టింది.వాషింగ్టన్, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో పాటు అమెరికా జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరోకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. వారి విశ్లేషణ ప్రకారం, ఇది కేవలం భవిష్యత్తు ముప్పు మాత్రమే కాదు. ఇప్పటికే 1995 నుంచి 2014 మధ్యకాలంలో నమోదైన డెంగీ కేసుల్లో 18 శాతం పెరుగుదలకు వాతావరణ మార్పులే కారణమని తేలింది. దీనివల్ల ఏటా సగటున 46 లక్షల మంది అదనంగా డెంగీ బారిన పడుతున్నారని అంచనా వేశారు.డెంగీ వైరస్ను వ్యాపింపజేసే దోమలు వృద్ధి చెందడానికి, వ్యాధి వ్యాప్తికి సుమారు 27.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చల్లగా ఉన్న ప్రాంతాలు వేడెక్కుతున్న కొద్దీ అక్కడ డెంగీ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. మెక్సికో, పెరూ, బ్రెజిల్ వంటి దేశాల్లోని అధిక జనాభా కలిగిన చల్లని ప్రాంతాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేశారు."ఉష్ణోగ్రత ప్రభావం మేం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలో చిన్న మార్పు కూడా డెంగీ వ్యాప్తిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం" అని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన వాషింగ్టన్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరిస్సా చైల్డ్స్ తెలిపారు.గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల స్థాయిని బట్టి 2050 నాటికి డెంగీ కేసులు 49 నుంచి 76 శాతం వరకు పెరగవచ్చని ఈ అధ్యయనం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉందని, దీనివల్ల దాదాపు 26 కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో పడతారని పేర్కొంది. వాతావరణ మార్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం, దోమల నియంత్రణ, ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, కొత్త డెంగీ వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడం వంటి చర్యల ద్వారా ఈ ముప్పును తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ అధ్యయన వివరాలు "ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" జర్నల్లో ప్రచురితమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa