డిప్యూటీ సీఎం, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో పర్యటించనున్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ సిబ్బందికి నివాళులు అర్పించడంతో పాటు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సూర్యలంక రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో అటవీ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపాన్ని పవన్ ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన 23 మంది అమరవీరుల కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ ఆత్మీయ సమావేశంలో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నారు.పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కల్యాణ్, ఈ పర్యటనలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరుదైన 'తాళపత్ర గ్రంథం' జాతికి చెందిన తాటి మొక్కలను సూర్యలంక తీర ప్రాంతంలో నాటతారు. సముద్ర కోతను అరికట్టేందుకు, తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలతో ఒక 'గ్రీన్ వాల్' తరహాలో హరిత రక్షణ కవచం ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో సూర్యలంక తీరంలో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa