మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో కీలకమైన సర్టిఫికెట్ల పరిశీలన దశలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ అనూహ్యమైన నిబంధన విధించడంతో వారిలో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.డీఎస్సీ దరఖాస్తు సమయంలో మహిళా అభ్యర్థులు వివాహితులా, అవివాహితులా అనే వివరాలను స్పష్టంగా తీసుకున్నారు. అయితే, వివాహిత మహిళలు తమ విద్యార్హతలు, ఇతర రిజర్వేషన్ పత్రాల మాదిరిగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను కూడా తండ్రి కుటుంబ ఆదాయం ఆధారంగానే సమర్పించారు. దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వివాహం తర్వాత సంపన్న కుటుంబాలలోకి వెళ్లిన కొందరు మహిళలు, తమ పుట్టింటి ఆదాయాన్ని చూపి ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెంటనే స్పందించింది. వివాహిత మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను (డీఈవోలు) ఆదేశించింది. ఈ ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు, ఒక జిల్లాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులను గుర్తించారు. వీరిలో 35 మంది తండ్రి పేరుతో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. వెంటనే స్పందించి, భర్త పేరుతో కొత్త సర్టిఫికెట్లు తేవాలని వారికి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa