విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టిస్తోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలంటే అది ప్రజా ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేవలం నిరసనలతో కాకుండా, ప్రజలంతా ఏకమై ఉద్యమిస్తేనే కేంద్రం వెనక్కి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.విశాఖ ఉక్కు పరిరక్షణే తమ పార్టీ ధ్యేయమని పునరుద్ఘాటించిన బొత్స, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం చేయడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో తమ పార్టీ వైఖరి మొదటి నుంచి స్పష్టంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు.కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకోవడంతో వైసీపీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. విశాఖలో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఆందోళనలు చేపట్టారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో కేంద్రం ఆ నిర్ణయం నుంచి తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. నష్టాల్లో ఉన్న ప్లాంట్కు ఆర్థికంగా చేయూతనివ్వడంతో ఆందోళనలు కొంతకాలం సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ ప్రైవేటీకరణ వార్తలు తెరపైకి రావడంతో, బొత్స లాంటి సీనియర్ నేతల వ్యాఖ్యలతో ఈ అంశం రాష్ట్రంలో మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa