ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ను చైనా నుంచి దూరం చేయడమే మా లక్ష్యం: ట్రంప్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 09:10 PM

భారత్-అమెరికాల మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌తో యుద్ధానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూ అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింది. ఈక్రమంలోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త క్షీణించాయి. కానీ ట్రంప్ మాత్రం ఈ గొడవ కొన్నాళ్లే ఉంటుందని చెబుతున్నారు. భారత్‌తో తమ బంధం శాశ్వతంగా నిలుస్తుందని పదే పదే వెల్లడిస్తున్నారు.


అయితే తాజాగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను చైనాకు దూరం చేసి యూఎస్‌కు దగ్గర చేసుకోవడమే తమ ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చకు కారణం అయ్యాయి. "భారత్‌తో మా బంధం చైనా కంటే చాలా బలమైనది. అలాగే సానుకూలమైనది. భారత్‌ను చైనా నుంచి దూరం చేయడం, మాకు దగ్గర చేసుకోవడమే మా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి" అని సెర్గియో గోర్ స్పష్టం చేశారు.


రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలుపై కూడా సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "భారత్ రష్యా చమురును కొనడం మానుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంగా చెప్పారు. బ్రిక్స్ కూటమిలో భారత్ ఎల్లప్పుడూ మాకు మద్దతుగా ఉంది. బ్రిక్స్‌లో చాలా దేశాలు యూఎస్ డాలర్‌ను పక్కన పెట్టాలని కోరుకున్నా.. భారత్ అందుకు అడ్డుకట్ట వేసింది" అని అన్నారు. అలాగే ట్రంప్, ప్రధాని మోదీల మధ్య ఉన్న స్నేహబంధం చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. మోదీ భారత్‌పై విమర్శలు గుప్పించినా.. ప్రధాని మోదీపై మాత్రం ప్రశంసల జల్లు కురిపించడానికి ఆసక్తి కనబరుస్తారని పేర్కొన్నారు.


భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని, దాని భౌగోళిక స్థానం, ఆర్థిక వృద్ధి, సైనిక సామర్థ్యాలు ప్రాంతీయ స్థిరత్వానికి కీలకం అని గోర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్‌జీ కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే కొనసాగుతున్నాయన్నారు. అమెరికా మొత్తం జనాభా కంటే కూడా భారతదేశంలోని మధ్య తరగతి ప్రజలే ఎక్కువని.. ఈ దేశ మార్కెట్ అమెరికా అపారమైన అవకాశాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


భారత వాణిజ్య మంత్రి, ఇతర ప్రతినిధులను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని గోర్ పేర్కొన్నారు. వారు త్వరోలనే అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి జామిసన్ గ్రిర్‌తో సమావేశం అవుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆశించదగని ఒప్పందం జరిగే ఉవకాశం ఉందని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే.. భారత్ నుంచి తాము ఎక్కువగా ఆశిస్తున్నామని సెర్గియో గోర్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa