నేపాల్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కి, భారత్తో సంబంధాలపై తన తొలి స్పందనను వెల్లడించారు. తాను ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ‘నమస్కారం’ చెబుతానని, ఆయనపై తనకు మంచి అభిప్రాయం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన బంధాన్ని వివరిస్తూ, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.శుక్రవారం ప్రధానిగా ఎంపికైన అనంతరం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశీల మాట్లాడారు. భారత్-నేపాల్ సంబంధాలపై మాట్లాడుతూ, "వంటగదిలో గిన్నెలు ఉన్నప్పుడు అవి చప్పుడు చేయడం సహజం. అలాంటివి జరుగుతూనే ఉంటాయి" అని హిందీ సామెతను ఉదహరించారు. కష్టకాలంలో నేపాల్కు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమే అయినా, ప్రజల మధ్య సంబంధాలు ఎంతో బలమైనవని స్పష్టం చేశారు. "మా బంధువులు, స్నేహితులు ఎందరో భారత్లో ఉన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఎంతో ప్రేమ, సద్భావన ఉన్నాయి" అని ఆమె అన్నారు.తనకు భారత్తో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా కార్కి గుర్తుచేసుకున్నారు. తాను వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ లో మాస్టర్స్ చదివిన రోజులను నెమరువేసుకున్నారు. "నాకు ఇప్పటికీ నా గురువులు, స్నేహితులు గుర్తున్నారు. గంగా నది తీరంలోని మా హాస్టల్ కూడా జ్ఞాపకం ఉంది. వేసవి రాత్రుల్లో మేమంతా ఆ భవనంపైన నిద్రపోయేవాళ్లం," అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.తన స్వస్థలం బిరాట్నగర్ భారత సరిహద్దుకు కేవలం 25 మైళ్ల దూరంలోనే ఉందని, చిన్నప్పుడు సరిహద్దులోని మార్కెట్కు వెళ్లి తరచూ సరుకులు కొనుగోలు చేసేదాన్నని ఆమె తెలిపారు. భారత నాయకులను తాము సోదర సమానులుగా భావిస్తామని, వారి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని సుశీల కార్కి అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలు, దేశాల మధ్య విధానపరమైన నిర్ణయాలపై త్వరలోనే చర్చలు జరుపుతామని ఆమె వివరించారు. 73 ఏళ్ల సుశీల కార్కి, దేశంలో పాతుకుపోయిన పాత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా యువ నిరసనకారులు చేసిన ఉద్యమం ఫలితంగా ప్రధాని పదవిని అలంకరించడం విశేషం.మాజీ ప్రధాని ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో నేపాల్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, పోలీసుల కాల్పుల్లో 51 మందికి పైగా మరణించారు. ప్రజాగ్రహం తీవ్రరూపం దాల్చడంతో ఓలీ ప్రభుత్వం గద్దె దిగక తప్పలేదు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్, నిరసనకారుల ప్రతినిధులు, ఆర్మీ చీఫ్ మధ్య జరిగిన చర్చల అనంతరం సుశీల కార్కిని మధ్యంతర ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2016 నుంచి 2017 వరకు నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె, అవినీతి కేసుల్లో ఎంతోమంది రాజకీయ నాయకులకు శిక్షలు విధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa